నీటి వినియోగ లెక్కలేవీ..?

9 Nov, 2016 05:06 IST|Sakshi

కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి వినియోగ లెక్కలు కోరిన కృష్ణా బోర్డు
సంయుక్తంగా కాకున్నా ఒకరైనా పంపించాలని సూచన

 
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న నీటి వినియోగ లెక్కలు సమర్పించకపోవడంపై రాష్ట్రాన్ని కృష్ణా బోర్డు ప్రశ్నించింది. ప్రాజెక్టుల వద్ద సంయుక్త పర్యవేక్షణ జరిపి నీటి వినియోగ లెక్కలను ఎప్పటికప్పుడు పంపాలని కోరినా ఎందుకు చేయడం లేదని నిలదీసింది. ఈ మేరకు రాష్ట్రానికి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ మంగళవారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల్లో గుర్తించిన ప్రాంతాల్లో నీటి వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో ఇదివరకే సంయుక్త పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశారని లేఖలో గుర్తుచేశారు.

శ్రీశైలం నుంచి కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమాల ద్వారా వాడుతున్న నీటి లెక్కలపై సంయుక్త కమిటీలు లెక్కలు సమర్పించాలని కోరినా అది కూడా జరగడం లేదని తెలిపారు. దీనికి తోడు జూరాల నుంచి కల్వకుర్తికి తీసుకుంటున్న నీటితో పాటు, జూరాల కుడి, ఎడమ కాల్వల కింద జరుగుతున్న వినియో గంపైనా ఇప్పటివరకు లెక్కలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా నీటి వినియోగ లెక్కలు సంయుక్తంగా బోర్డుకు మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా పంపాలని సూచిం చారు. ఒకవేళ ఇరురాష్ట్రాలు సంయుక్తంగా పంపించలేని పరిస్థితుల్లో ఏ ఒక్కరైనా వినియోగ లెక్కలు పంపాలని లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు