-
కొత్తకోటలో రెండు డీసీఎంలు ఢీ: క్లీనర్ మృతి
-
జడ్చర్లలో లారీ కింద పడిన వృద్ధుడు
జిల్లాలో రెండే వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కొత్తకోట మండలంలో జాతీయ రహదారిపై రెండు డీసీఎంలు ఢీ కొట్టుకోవడంతో క్లీనర్ మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయడపడ్డారు. జడ్చర్లలో రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టడంతో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.
కొత్తకోట రూరల్: జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ఓ డీసీఎంను వెనక నుంచి మరో డీసీఎం ఢీ కొట్టడంతో క్లీనర్ మృత్యువాడపడిన సంఘటన కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజీ సమీపంలో చోటు చేసుకుంది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళుతున్న డీసీఎం గురువారం తెల్లవారుజామును అదే రూట్లో వెళుతున్న మరో డీసీఎంను అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనక డీసీఎం క్లీనర్ చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాల్రాం, మోహన్కుమార్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చంద్రశేఖర్ది అనంతపురం జిల్లా గుత్తివాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమాకాంత్రావు తెలిపారు.
రోడ్డు దాటుతుండగా..
జడ్చర్ల: లారీ కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం మధ్యాహ్నం బాదేపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక పాతబజార్కు చెందిన మొతుకూరు అంజయ్య(55) సిగ్నల్గడ్డలోని ఎస్బీఐకి పని నిమిత్తం వచ్చి బ్యాంకు ఎదుట రోడ్డు దాటుతున్న క్రమంలో సిగ్నల్గడ్డ నుంచి నేతాజీ చౌరస్తా వైపు అతివేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లారీ టైరు కింద పడి తీవ్ర గాయపడిన అంజయ్యను వెంటనే 108అంబులెన్స్లో బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూదన్గౌడ్ పేర్కొన్నారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ కరీంను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.