నలుగురు బాలురులు, ఓ వ్యక్తి అరెస్ట్
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంతో పాటు నందవరం మండలంలో చోరీలకు పాల్పడిన ఐదుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు బాలురులు, ఓ వ్యక్తి ఉన్నారు. వారి వివరాలను పట్టణ ఎస్ఐ కె.హరిప్రసాద్ విలేకరులకు వివరించారు. కొన్ని రోజులుగా పట్టణంలో చోరీలు జరుగుతుండటంతో కానిస్టేబుళ్లు దశరథరాముడు, రవి, విజయ్కుమార్ను ప్రత్యేక బృందంగా నియమించి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో కొందరు బాలురులు జులాయిగా తిరుగుతూ వైట్నర్కు బానిసలై మత్తులో ఇళ్లలోకి దూరి దొంగతనాలు చేయటం, షాప్లను షర్టర్లు ధ్వంసం చేస్తున్నట్లు గుర్తించారు. వారిపై నిఘా ఉంచి 2016 అక్టోబర్లో ముగతి పేటలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిన కేసులో నలుగురు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 2016 ఫిబ్రవరి నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో పట్టణానికి చెందిన బానును గురుజాల దగ్గర అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు రూ. లక్ష రూపాయాల విలువ చేసే బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చెప్పారు. సమావేశంలో నందవరం ఎస్ఐ జగన్ మోహన్ యాదవ్, పోలీసులు తదితరులు ఉన్నారు.