నిడదవోలులో భారీ చోరీ

25 Aug, 2016 22:31 IST|Sakshi
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు : నిడదవోలులో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక  శాంతినగర్‌ వాటర్‌ట్యాంక్‌ సమీపంలోని గుత్తుల రంగారావు ఇంట్లో దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. ఈ ఇంట్లో గుత్తుల రంగారావు, అతని భార్య పార్వతి ఉంటున్నారు. మూడునెలల క్రితం రంగారావుకు గుండె ఆపరేషన్‌ చేయించేందుకు వారిద్దరూ హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు  ఇంటి ముందు ద్వారం గొళ్లాన్ని విరిచేసి.. గుణపంతో తాళాన్ని బద్దలకొట్టి లోపలకు ప్రవేశించారు. ఇంట్లోని వస్తువులను చిందవందరగా పడేశారు. బీరువాను తెరచి అందులోని లాకర్లలో భద్రపరిచిన  ఐదు కాసుల బంగారం, పూజగదిలో ఉన్న ఉన్న కేజీన్నర వెండి వస్తువులు, డిబ్బీలో దాచుకున్న రూ.20 వేలు అపహరించుకుపోయారు.  బీరువాలో దేవుని పటాల వద్ద ఉన్న చిల్లర నాణేలను మాత్రం దుండగులు ముట్టుకోలేదు. పట్టణ ఎసై ్స ఎం. భగవాన్‌ప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 
 
 
 
 
 
 
మరిన్ని వార్తలు