గోడలు, కిటికీలను విచారిస్తారా?

18 Feb, 2016 21:58 IST|Sakshi

యూనివర్సిటీలో ఉన్నప్పుడే కమిటీని పంపాలి: ప్రొ. కోదండరాం
వరంగల్:
సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ మృతికి కారుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు ఈనెల 23న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారని, అయితే కేంద్ర ప్రభుత్వం ఆ రోజే విచారణ కమిటీని హైదరాబాద్‌కు పంపించడం ఏమిటని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. విద్యార్థులు లేనప్పుడు విచారణ ఎలా జరుపుతారన్నారు. వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ ఉద్యమ అమరుడు పిల్లి గిరిబాబు వర్ధంతి సభను గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. 23న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నారని, ఆ రోజు విచారణకు వచ్చి గోడలు, కిటికీలను విచారిస్తారా? అని ఎద్దేవా చేశారు. రోహిత్ మృతిపై వాస్తవాలు మరుగనపడేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈనెల 23న కాకుండా.. విద్యార్థులు యూనివర్సిటీలో ఉండే.. మరో రోజు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు