పోలీస్‌ కాదు పోకిరి

3 Jun, 2017 08:33 IST|Sakshi
కోర్టుకు హాజరైన హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌
– గృహిణిని ఫొటోలు తీస్తూ చిక్కిన హెడ్‌కానిస్టేబుల్‌
– సబ్‌జైలుకు తరలింపు
  
నంద్యాల: ఆకతాయిల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పోకిరి అవతారమెత్తి చివరకు జైలు పాలయ్యాడు. నంద్యాల సరస్వతి నగర్‌లో నివాసం ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌ నంద్యాల తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తూ ఇటీవల మిడుతూరుకు బదిలీ అయ్యారు. రాజమండ్రికి చెందిన ఓ పెళ్లి బృందం నందికొట్కూరుకు వివాహానికి హాజరైంది. ఈ బృందంలో ఓ మహిళ, ఆమె సోదరులు చంద్రశేఖర్, శంకర్‌ వెంట ఉన్నారు. వీరు మళ్లీ రాజమండ్రికి బయల్దేరానికి గురువారం నందికొట్కూరుకు నుంచి నంద్యాలకు ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. మార్గమధ్యంలో మిడుతూరులో హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌ కూడా బస్సు ఎక్కాడు.

బస్సులో ఉన్నంత సేపు పెళ్లి బృందంలోని ఓ యువతితో వెకిలిగా ప్రవర్తించాడు. బస్సు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌ చేరాక, ఈ యువతి లగేజి తీసుకుంటూ ఉండగా హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌ సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశాడు. ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని చితకబాది వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌ కేసు నమోదు చేసి అతన్ని శుక్రవారం జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరిచారు. జడ్జి బాబాఫకృద్దీన్‌ బెయిల్‌కు నిరాకరించి రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని సబ్‌జైలుకు తరలించారు. 
>
మరిన్ని వార్తలు