నికరంగా రూ. 2.02 కోట్ల లాభం

4 Jul, 2017 00:25 IST|Sakshi
- 2016-17లో డీసీసీబీ లావాదేవీలపై చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి
- బ్యాంకు టర్నోవర్‌ను రూ.1340 కోట్లకు పెంచాం 
- 62 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ 
 
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా సహకారకేంద్రబ్యాంకు 2016-17లో నిర్వహించిన లావాదేవీలపై నికరంగా రూ.2.02 కోట్ల లాభం వచ్చిందని బ్యాంకు చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి తెలిపారు. డీసీసీబీకి ఏటా లాభాలు వస్తుండటంతో మొదటి నుంచి ఉన్న నష్టాలు తగ్గుతున్నాయని, మరో రెండు, మూడేళ్లలో నష్టాలను పూర్తిగా అధిగమిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది లావాదేవీలపై నాబార్డు స్టాచ్యుటరీ ఆడిట్‌ పూర్తయి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో చైర్మన్‌ సోమవారం సీఈఓ రామాంజనేయులుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  2015-16లో రూ.1040 కోట్లుగా  ఉన్న బ్యాంకు టర్నోవర్‌ 2016-17కు రూ.1340 కోట్లకు పెరగడం, రికవరీలు మెరుగ్గా ఉండటంతో లాభాలు వచ్చాయని తెలిపారు. ఈ కారణంగా బ్యాంకు నష్టాలు రూ.16.81 కోట్ల నుంచి రూ.14.78 కోట్లకు తగ్గినట్లు చెప్పారు. నిరర్థక ఆస్తులు స్టేట్‌ యావరేజ్‌ 5 శాతం ఉండగా డీసీసీబీకి 4.96 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం క్యాపిటల్‌ టు రిస్క్‌ వెయిటెడ్‌ అసెస్‌ రేషియో(సీఆర్‌ఎఆర్‌) విధిగా 9 శాతం ఉండి తీరాలని, ప్రస్తుతం డీసీసీబీకి 9.61 శాతంగా ఉందన్నారు.
 
 2016-17లో ఆప్కాబ్‌ లాభాలపై డీసీసీబీకి 5శాతం డెవిడెంట్‌ రూపంలో రూ.99 లక్షలు విడుదలవుతున్నాయన్నారు. కేడీసీసీబీలో ఉన్న 62 స్టాప్‌ అసిసెంటు పోస్టుల భర్తీ కోసం మూడు, నాలుగు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపారు. 50శాతం పైగా రికవరి ఉన్న çసహకార సంఘాలకు దీర్ఘకాలిక రుణాల కింద రూ.80 లక్షలు ప్రకారం రూ.56 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రైతు నేస్తం, కర్షకజ్యోతి, పంట రుణాల పంపిణీకి కొత్తగా రూ.200 కోట్ల వరకు రుణాలుగా అందిస్తామన్నారు.
 
రూ.లక్ష చెక్‌ అందచేత...
బండిఆత్మకూరు మండలం పరమటూరు సహకార సంఘంలో సభ్యుడిగా ఉన్న రైతు నాగపుల్లయ్య ప్రమాదవశాత్తు మరణించడంతో వ్యక్తిగత ప్రమాద బీమా కింద రూ.లక్ష చెక్కును మృతుడి భార్య శివలక్ష్మమ్మకు  చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి అందించారు. కార్యక్రమంలో సీఈఓ రామాంజనేయులు, డైరెక్టర్‌ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు