రూ. 2.50 కోట్లకు ‘టెండర్‌’

6 Sep, 2016 23:42 IST|Sakshi
రూ. 2.50 కోట్లకు ‘టెండర్‌’
 
మచిలీపట్నం (ఈడేపల్లి) : 
 
పుష్కరాల నిధుల నుంచి రూ. 2.50 కోట్లతో నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌ నిర్మాణంలో నాణ్యత భూతద్దం పెట్టి వెదికినా కనిపించడం లేదు. నిర్మించిన కొద్ది రోజు లకే పగుళ్లు బీటలు షరా మామూలే. విలువైన ప్రజాధనం అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల వల్ల ఎలా దుర్వినియోగం అవుతోందో ఇక్కడే తేటతెల్లమవుతుంది. 
 పట్టణంలోని నాగపోతురావు సెంటరు నుంచి బస్టాండు వరకు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీపై ఫుట్‌పాత్‌లను నిర్మించేందుకు పనులను చేపట్టారు. దాదాపు మూడు కిలోమీటర్లు పొడవునా నిర్మిస్తున్న ఈ కాలిబాట పనుల్లో ఆదితోనే నాణ్యత లోపించింది. వంద మీటర్ల దూరం కూడా నిర్మించని గోడకు అప్పుడే పగుళ్ళు వస్తుంటే దాదాపు మూడు కిలోమీటర్ల చేయాల్సిన పనిలో ఎంత వరకు నాణ్యత ఎంత, ఇది ఎంతకాలం మనగలుగుతుంది? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 
అడుగడుగునా ప్రమాణాలకు పాతర 
డ్రైనేజీపై ఆరు అడుగులు వెడల్పున సిమెంటు బిళ్ళలను ఏర్పాటు చేసి వాటిపై కాలిబాటను నిర్మించాలి. ఇందుకు ఉపయోగిస్తున్న పరికరాలు, మెటీరియల్‌ నాణ్యతను క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు ముందుగా తనిఖీచేసి అన్నీ నిర్ధరించాకే పనులు చేయాలి. కానీ పనులు అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయి. దీనివల్లే నిర్మాణ దశలోనే పగుళ్ళు వస్తున్నట్లు తెలుస్తొంది. డ్రైనేజీపై నిర్మించాల్సిన ఆరు అడుగుల సిమెంటు బిళ్ళలను కొత్తవి నిర్మించకుండా పాత వాటినే ఉపయోగిస్తున్నారు. వాటిలో కొన్ని పగిలిపోయి ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. శి«థిలావస్థకు చేరిన బిళ్ళలపై నిర్మాణాలు చేస్తే అవి ఎంత వరకు ఉపయోగకరం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  ఇటీవలే బస్టాండ్‌ సెంటరు నుంచి జిల్లా పరిషత్‌ ఆఫీసు వరకు చేపట్టిన డివైడర్‌ పనులకు టెండర్లు వేయకుండానే పనులు చేపట్టడం, తాజాగా ఫుట్‌పాత్‌కు అనుమతులు లేకుండానే పనులు చేపట్టడం వెనుక మతలబేమిటో అధికారులే చెప్పాలి. కాంట్రాక్టర్ల వద్ద నుంచి మున్సిపాలిటీలో కొందరు అధికారులు పెద్దమొత్తంలో మామూళ్ళను దండుకున్నట్లు తెలుస్తోంది. అందువలనే ఈ బాగోతాన్ని చూసీచూడనట్లు వదిలేశారన్న ఆరోపణలు ప్రజల్నుంచి వినిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ^è ర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 
అనుమతులు లేని మాట వాస్తవమే 
క్వాలిటి కంట్రోల్‌ విభాగం నుంచి అనుమతులు లేని మాట వాస్తవమేనని మున్సిపల్‌ ఇంజనీర్‌ కామేశ్వరావు అన్నారు. ఇంటర్‌నెల్‌ ల్యాబ్‌లో పరిశీలించిన తర్వాతే పనులు చేపట్టాం, విరిగిన గోడలను మళ్ళీ కట్టిస్తాం అని చెప్పారు. 
 : కామేశ్వరరావు, మున్సిపల్‌ ఇంజనీర్‌ 
 
మరిన్ని వార్తలు