దుకాణం నడుపుకోవాలంటే రూ.50 వేలు ఇవ్వాలి

25 Aug, 2016 22:31 IST|Sakshi
దుకాణం నడుపుకోవాలంటే రూ.50 వేలు ఇవ్వాలి
 
నరసరావుపేట టౌన్‌ (గుంటూరు): ‘‘రూ.50 వేలు ఇస్తేనే దుకాణం పెట్టుకో.. లేకుంటే ఆ స్థలంలో పార్టీ కార్యాలయం పెడతాను. అప్పుడు నువ్వు చేయగలిగిందేమీ లేదు.. ఏ అధికారి కూడా నా వైపు కన్నెత్తి చూడలేడు. నాకు అధికారపార్టీ అండ ఉంది. ఎన్నికల్లో చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. ఆ లోటు పూడ్చుకోవాలిగా..’’ అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్‌ భర్త ఓ దివ్యాంగురాలిని వేధిస్తున్న తీరిది..
నరసరావు పేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల వెనుకభాగంలో భగీరథ గంగాభవాని అమ్మవారి ఆలయం ఉంది. ఆలయంలో దూపదీపనైవేద్యాలు చేసుకుంటూ దివ్యాంగురాలైన నంద్యాల నాగసుబ్బమ్మ కుటుంబం ఆలయం పక్కన నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఆలయం ద్వారా వస్తున్న ఆదాయంతో ఇల్లు గడవక పోవడంతో ఇంటి పక్కన సులభ్‌æ కాంప్లెక్స్, ఈ రెండింటి మధ్య టైలరింగ్‌ దుకాణం ఏర్పాటుచేసుకొని నాగసుబ్బమ్మ కుటుంబాన్ని సాకుతోంది. ఆ వార్డు మహిళా కౌన్సిలర్‌ భర్త కె సంజీవరావు ఆమె వద్దకు వెళ్ళి అక్కడ దుకాణం నిర్వహించుకోవాలంటే తనకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తాను అడిగినంత ఇవ్వకుంటే ఆ స్థలం ఖాళీ చేయించి అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటుచేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె వినకపోవడంతో బుధవారం మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆక్రమణ పేరుతో తొలగించే దుకాణాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశాడు. బాధితురాలు అ«ధికారుల చర్యను వ్యతిరేకిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో వచ్చిన సిబ్బంది వెను తిరిగారు. అయితే కౌన్సిలర్, ఆమె భర్త మాత్రం ఎలాగైనా నాగసుబ్బమ్మ  ఉంటున్న స్థలాన్ని కబ్జా చేయాలని మరింత పట్టుదలగా తమ∙ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. మున్సిపల్‌ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఇంటిని, దుకాణాన్ని నేలమట్టం చేయాలని కుట్ర పన్నుతున్నట్లు తెలిసింది. 
పదహారేళ్లుగా పన్నులు చెల్లిస్తున్నా..
– నంద్యాల నాగసుబ్బమ్మ, బాధితురాలు
ఆలయాన్ని నమ్ముకొని మూడు తరాల నుంచి మా కుటుంబం జీవిస్తోంది. భక్తుల ద్వారా వచ్చే కానుకలు ఆలయ నిర్వహణకే సరిపోకపోవడంతో టైలరింగ్‌ వత్తితో జీవనం కొనసాగిస్తున్నా. గత కొన్నిరోజులుగా కౌన్సిలర్‌ భర్త సంజీవరావు తనకు రూ.50వేలు ఇస్తేనే దుకాణం నిర్వహించుకోవాలని, లేకుంటే అక్కడ టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేస్తానని బెదిరిస్తున్నాడు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇంటి, కరెంటు పన్నులు చెల్లిస్తున్నా. కేవలం కౌన్సిలర్‌ ఒత్తిడితో స్థలం ఖాళీ చేయాలని అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. విషయాన్ని వికలాంగుల సంఘం రాష్ట్ర ప్రతినిధుల దష్టికి తీసుకువెళ్ళా. వారి ఆధ్వర్యంలో న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నా. 
 
చర్యలు తీసుకోవాలి: ఎంఐఎం పార్టీ నేతల డిమాండ్‌ 
దివ్యాంగురాలి స్థలంపై కన్నేసిన కౌన్సిలర్, ఆమె భర్త, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షేక్‌ కరీముల్లా, ఉపాధ్యక్షుడు మస్తాన్‌ వలి, పట్టణాధ్యక్షుడు మౌలాలి డిమాండ్‌ చేశారు. నాగసుబ్బమ్మను గురువారం వారు పరామర్శించి విలేకర్లతో మాట్లాడారు. ౖటైలరింగ్‌ దుకాణం నడుపుకుంటూ పొట్ట పోసుకుంటున్న దివ్యాంగురాలి  పొట్ట కొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో ఆక్రమణలున్నా  వాటి జోలికి వెళ్ళకుండా కేవలం నాగసుబ్బమ్మ స్థలాన్ని కాజేయాలన్న దురుద్దేశ్యంతో కౌన్సిలర్‌ భర్త చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు సహకరించడం సరికాదన్నారు. ఎవ్వరికీ అభ్యంతరం లేని ప్రదేశంలో ఆమె దుకాణం పెట్టుకొని జీవిస్తుందన్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు పద్ధతి మార్చుకోకుంటే నాగసుబ్బమ్మ చేసే న్యాయపోరాటానికి తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందన్నారు. 
 

 

మరిన్ని వార్తలు