సాదా బైనామా పేదలకు మాత్రమే..

14 Jun, 2016 11:08 IST|Sakshi
సాదా బైనామా పేదలకు మాత్రమే..

* రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి కాదు
* జేసీ దివ్య

అశ్వారావుపేట: ప్రభుత్వం సాదా బైనామా అవకాశం కేవలం పేదవారికి మాత్రమే కల్పించిందని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాదని జేసీ దివ్య స్పష్టం చేశారు. సాదా బైనామాపై సోమవారం అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పట్టా భూములను సాగుచేసుకుంటున్న నిరుపేదలకు భూమి హక్కు కల్పించేందుకే సాదా బైనామా కార్యక్రమం అని వివరించారు.

మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా దరఖాస్తు ఆన్‌లైన్‌లో ఉండటంతోపాటు తహసీల్దార్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు పరిశీలించేందుకు వీలుంటుందన్నారు. మీసేవ సర్వర్ వేగంగా లేదన్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు. కానీ ఆపరేటర్లు చిన్న తప్పు కూడా లేకుండా జాగ్రత్తగా డేటా ఎంట్రీ చేయాలని, రైతులు తమ దరఖాస్తులను పరిశీలించుకోవలన్నారు. వారసత్వ పట్టాల్లో ఇంటి పెద్ద పేరుతో గతంలో భూమి పత్రాలుండేవని.. అలాంటి వాటిని కూడా హ క్కుదారులంతా వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు.
 
ఎక్కడయినా ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటే తిరిగి తీసుకుంటామన్నారు. పేరాయిగూడెంలో 1228 సర్వే నంబరులో 2,600 ఎకరాల భూమి ఉందని.. డీజీపీఎస్ సర్వే ద్వారా హద్దులను నిర్ణయించి వివాదాలు లేకుండా చూస్తామన్నారు. ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు లేని భూముల లావాదేవీలకు మాత్రామే సాదాబైనామా ద్వారా హక్కు కల్పిస్తామన్నారు. వివాదాలుంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. 2014కు ముందు భూమి సాగులో ఉండాలని.. కనీసం తెల్లకాగితంపైనైనా రాసుకున్న ఒప్పంద పత్రం ఉండాలన్నారు.

దీనికోసం నోటరీ, స్టాంప్ పేపర్‌లకు నగదు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. అన్నింటికంటే ముందు భూమిలో సాగు చేస్తూ ఉండటం ముఖ్యమైన అంశమన్నారు. దళారులు, ఇతరుల మాటలు నమ్మి సొమ్ము వృథా చేసుకోవద్దన్నారు. మండల కేంద్రంలోని దొంతికుంట చెరువు ఆక్రమణ విషయం ఆమె దృష్టికి తీసుకువెళ్లగా ఐబీ అధికారులతో సంప్రదించి ఆక్రమణలను తొలగిస్తామన్నారు. మండలంలోని వెంకమ్మ చెరువులో చేపల చెరువు వ్యర్థాలను కలుపుతున్న విషమాన్ని ప్రస్థావించగా సీఆర్‌పీసీ 133 సెక్షన్‌ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ తహసీల్దార్ శ్రీనివాసరావును ఆదేశించారు.

మరిన్ని వార్తలు