ఒకే వేదికపైకి అన్ని కళాపరిషత్‌లు

1 May, 2016 09:31 IST|Sakshi

ఆ దిశగా కృషి చేస్తున్నామన్న పరుచూరి వెంకటేశ్వరరావు  
 
పల్లెకోన (భట్టిప్రోలు): రాష్ట్రంలోని అన్ని కళాపరిషత్‌లు కలిపి ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పరుచూరి రఘుబాబు మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం పల్లెకోనలో నిర్వహిస్తున్న అఖిల భారత నాటకోత్సవాలకు హాజరైన ఆయన విలేకర్లతో మాట్లాడారు. దాతల సహకారంతో రూ 1.10 కోట్ల వ్యయంతో పల్లెకోనలో కళా మండపం నిర్మించామన్నారు. స్థల దాత వేములపల్లి సుబ్బారావుకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది ఖమ్మం, పల్లెకోనలో నాటకోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
 
ఆదివారం సినీనటులు తనికెళ్లభరణి, రఘుబాబు, రావు రమేష్, 2న ‘శరణం గచ్ఛామి’  చిత్ర యూనిట్ విచ్చేస్తున్నట్లు వెల్లడించారు. సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఆడిటోరియం ఏర్పాటు వెనుక పరుచూరి బ్రదర్స్ కృషి అనిర్వచనీయమన్నారు. 26 ఏళ్లుగా నాటకోత్సవాలు నిర్వహించటం ముదావహని పేర్కొన్నారు. ‘ప్రేమించుకుందాంరా’’ సినిమాలో రాయలసీమ మాండలికం డైలాగులు పెట్టాలని సూచించిన వెంటనే పరుచూరి బ్రదర్స్ ఆచరించారని తెలిపారు. సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మనుమలు వెలగపూడి రఘు ఆదిత్య, వేదవ్యాస్, ట్రస్ట్ కోశాధికారి డాక్టర్ వెలగపూడి రాజగోపాల్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు