కాకినాడ సిటీ :
ఏజెన్సీ గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన జీసీసీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో అటవీ ఉత్పత్తులు, వనమూలికలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఆయుర్వేద గుణాలున్న జ్యూస్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. తేనె, అలోవిర సబ్బులు, షాంపూలు, శీకాయ, అరకులో ఉత్పత్తి అవుతున్న ఎంతో రుచికరమైన కాఫీపొడి, అరకు దంపుడు బియ్యం తదితర ఉత్పత్తులు ప్రజలకు అందుబాటు ధరల్లో దొరుకుతాయని వివరించారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం కె.జోగేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ తేజేశ్వరరావు, అడ్డతీగల జీసీసీ మేనేజరు బి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.