అనంతపురం అగ్రికల్చర్ :
ఖరీఫ్ను అత్యంత దారుణంగా కాటేసిన కరువు రక్కసి రబీ సీజన్నూ వెంటాడుతోంది. జులై తర్వాత ఒక్కరోజు కూడా సరైన వర్షం కురవకపోవడంతో ‘అనంత’ అతలాకుతలమైంది. పంట తొలగింపు ఖర్చులు కూడా దక్కే పరిస్థితి కనిపించకపోవడంతో కొన్ని చోట్ల వేరుశనగను పశువులు, గొర్రెలకు వదిలేశారు. సాగుకే కాదు.. తాగునీటికీ కటకట మొదలైంది. చలికాలంలోనే తాగునీరు లభించడం కష్టంగా మారింది. అననుకూల వర్షాలు, సుదీర్ఘ వర్షపాత విరామాల (డ్రైస్పెల్స్) కారణంగా ఈ ఖరీఫ్లో 6.09 లక్షల హెక్టార్లలో వేరుశనగ దెబ్బతినింది. 1.50 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు కూడా 90 శాతం వరకు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ వర్షాలు లేకపోవడంతో 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సిన రబీ పంటల విత్తనమే ఆగిపోయింది. ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుతం తరుణంలో కరువు పరిశీలనార్థం కేంద్ర బృందాలను జిల్లాకు తీసుకురాగలిగితే దుర్భిక్ష పరిస్థితుల తీవ్రత వారికి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లకూ సంబంధించి అన్ని పంటల పరిస్థితి, రైతుల స్థితిగతులు వారిని చలింపజేస్తాయనడంలో సందేహం లేదు. తద్వారా జిల్లాకు మేలు కలిగే అవకాశాలూ ఉంటాయి. అలాకాకుండా పంటలన్నీ తొలగించిన తర్వాత, ఎక్కడా పంటలు లేని సమయంలో కరువు బృందాలు పర్యటిస్తే ఒనగూరే ప్రయోజనాలేవీ ఉండవని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు.
కరువు నివేదికలు బుట్టదాఖలు
జిల్లాకు వచ్చి వెళుతున్న కేంద్ర బృందాలు చేసిన సిఫారసులు కూడా అమలు కావడం లేదు. వారికి ఇచ్చిన కరువు నివేదికలు బుట్టదాఖలవుతూనే ఉన్నాయి.