2వ పటాలం కమాండెంట్‌గా శామ్యూల్‌ జాన్‌

2 Mar, 2017 22:52 IST|Sakshi
2వ పటాలం కమాండెంట్‌గా శామ్యూల్‌ జాన్‌
- విజయ్‌కుమార్‌కు డీఐజీగా పదోన్నతి
 
కర్నూలు :  ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలం కమాండెంట్‌ విజయ్‌కుమార్‌ స్థానంలో సీహెచ్‌ శామ్యూల్‌జాన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గుంటూరుకు చెందిన ఈయన 1982లో ఆర్‌ఎస్‌ఐ హోదాలో ఏపీఎస్పీ విభాగంలో చేరారు. వరంగల్, కాకినాడ, మంగళగిరి బెటాలియన్లలో పని చేశారు. 1988లో ఆర్‌ఐగా, 2004లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా, 2011లో అడిషనల్‌ కమాండెంట్‌గా పదోన్నతి పొందారు. కర్నూలు రెండవ పటాలంలో విధులు నిర్వహిస్తూ 2013లో పదోన్నతిపై 11వ బెటాలియన్‌ కడప జిల్లాకు కమాండెంట్‌గా బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లపాటు విధులు నిర్వహించారు. ఈ నెల 1వ తేదీన కర్నూలు రెండవ పటాలం కమాండెంట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.
 
డీఐజీగా విజయ్‌కుమార్‌ :
ఏపీఎస్పీ రెండవ పటాలం కమాండెంట్‌గా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన విజయ్‌కుమార్‌కు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్పీ బెటాలియన్స్‌ మూడవ రేంజ్‌ (కర్నూలు, కడప, అనంతపురం) డీఐజీగా ఉన్న ప్రసాద్‌బాబు డిసెంబర్‌లో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో విజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. 2013 నుంచి ఈయన కర్నూలు ఏపీఎస్పీ రెండవ కమాండెంట్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విజయ్‌కుమార్‌ ఈ నెల 18వ తేదీన మూడవ రేంజ్‌ డీఐజీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. 
 
>
మరిన్ని వార్తలు