చిత్తూరు: చిత్తూరు జిల్లా గుర్రంకొండలో విషాదం చోటు చేసుకుంది. గుర్రంకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్ భవనం కూలిన ఘటనలో ఓ విద్యార్థిని మృతిచెందగా, మరో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో భవనం పైకప్పు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో హర్ష అనే విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. గాయపడిన విద్యార్థులను ఆటోలు, ఇతర వాహనాల్లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పాఠశాల భవనం వందేళ్ల పైబడిన పురాతనకట్టడం కావడం, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పైకప్పు కూలినట్టు తెలుస్తోంది. విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం వ్యవహరించడం ఈ ఘటనకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. పాఠశాల యాజమాన్యం ప్రస్తుతం అందుబాటులో లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై తెలిపారు.