సైన్స్‌ మేళా.. భళా

23 Aug, 2016 21:27 IST|Sakshi
అదనపు జేసీకి ఎగ్జిబిట్‌ పనితీరును వివరిస్తున్న విద్యార్థి
  • సృజన చాటిన ప్రదర్శనలు
  • వర్గల్‌ నవోదయలో రీజియన్‌ స్థాయి ఎగ్జిబిషన్‌
  • ప్రారంభించిన అదనపు జేసీ వెంకటేశ్వర్లు
  • వర్గల్‌: ఓ ఆలోచన సరికొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తుంది. అందుబాటులో వనరులు, ప్రోత్సహించే వారుంటే ఆ ఆలోచనలు మరింత పదునెక్కుతాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్ఫథం పెంపొందుతుంది. నిత్యజీవితంలో మానవాళికి ఉపయుక్తంగా నిలిచే కొంగొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి.

    వర్గల్‌ నవోదయ వేదికగా దక్షిణాది రాష్ట్రాల నవోదయ విద్యార్థుల రీజియన్‌ స్థాయి సైన్స్‌ మేళాను మంగళవారం జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ సైన్స్‌మీట్‌లో అత్యుత్తమంగా నిలిచిన 12 ప్రదర్శనలను జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారని విద్యాలయ ప్రిన్సిపాల్‌ వెంకటరమణ తెలిపారు. ఈ ప్రదర్శనలో తెలంగాణతోపాటు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, యానామ్‌ ప్రాంతాల  నవోదయ విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు.

    సేంద్రియ సాగు, పర్యావరణ పరిరక్షణ, మానవరహిత రైల్వే క్రాసింగ్‌ వ్యవస్థ, సురక్షిత ప్రయాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆసక్తికరంగా గణితం నేర్చుకునే విధానం, సులభ పద్ధతిలో త్రికోణమితి, నిర్మాణాల్లో పైథాగరస్‌ సిద్ధాంతం, వృథా వస్తువులతో చక్కని ఆకృతుల తయారీ.. ఇలా ఎన్నో నిత్య జీవితంతో ముడిపడిన 98 అంశాలతో సందర్శుకులను అబ్బురపరిచారు. తొలిరోజు సందర్శకులను అనేక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతిథి అదనపు జేసీ వాసం వెంకటేశ్వర్లు ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు.

    ఆకట్టుకున్న ప్రదర్శనలు కొన్ని..

    • ఊహా గణితంపై ఆదిలాబాద్‌ నవోదయకు చెందిన ఆకాంక్షరెడ్డి ప్రదర్శన ఆకట్టుకు​ది. తన ప్రయోగం ద్వారా స్థలం‍్వృథాకాకుండా ఎలాంటి ఆకృతి దోహదపడుతుందో వివరించింది.
    • పైథాగరస్‌ సిద్ధాంతం ద్వారా తక్కువ స్థలంలో ఎత్తయిన కట్టడాలు ఎలా చేపట్టవచ్చో రంగారెడ్డి జిల్లా నవోదయ విద్యార్థి పి.వినయ్‌కుమార్‌ వివరించాడు.
    • సులభంగా త్రికోణమితి నేర్చుకునే విధానాన్ని కర్ణాటకలోని చిక్‌మగళూర్‌ నవోదయ విద్యార్థి కేఎన్‌ జయంత్‌ తన ప్రయోగం ద్వారా నిరూపించాడు.
    • పూసలతో వివిధ ఆకర్షణీయ వస్తువులు తయారు చేసుకోవచ్చని సూచిస్తూ నిజామాబాద్‌ విద్యార్థిని ఆర్‌.సహన పలు వస్తువులు ప్రదర్శించింది.
    • వృథా వస్తువులను వినియోగించి విలువైన వస్తువులను తయారు చేసే చక్కని ప్రదర్శనను కేరళ రాష్ట్రం అలప్పీ విద్యార్థి ఎస్‌.వివేక్‌ ఏర్పాటు చేశాడు. వాడి పడేసిన పెన్నులతో పెన్‌ హౌస్, కాగితాలతో గుర్రపు బొమ్మలను తీర్చిదిద్దాడు.
    • కాగితాలు, గుండీలు తదితర వస్తువులతో ఆకర్షణీయమైన రీతిలో చెవి దిద్దులు, ఆభరణాలు ఎలా తయారు చేయవచ్చో వెస్ట్‌ గోదావరి విద్యార్థిని కె.భారతి తన ప్రదర్శన ద్వారా చూపింది.
    • గణితం ఆసక్తికరంగా నేర్చుకునే విధానాన్ని చూపుతూ అనంతపురం విద్యార్థి వీపీ వంశీకృష్ణ ప్రదర్శన ఆకట్టుకున్నది.
మరిన్ని వార్తలు