పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

18 Feb, 2017 00:53 IST|Sakshi
పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

– ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవ్‌ చౌదరి
హిందూపురం రూరల్‌ : పట్టు పరిశ్రమలోని అన్ని విభాగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవ్‌ చౌదరి పేర్కొన్నారు. పట్టణంలోని పట్టుగూళ్ల మార్కెట్‌ సమావేశం హాలులో శుక్రవారం రైతులు, చర్కా రీలర్లు, ట్విస్టర్లతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు, రీలర్లు, ట్విస్టర్లు పాల్గొని పట్టుపరిశ్రమ శాఖ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా గోరంట్ల మండలం నార్శింపల్లికి చెందిన రైతు శివారెడ్డి మాట్లాడుతూ పట్టుపురుగుల పెంపకం షెడ్డుకు రూ.80 వేల బదులు రూ.3 లక్షలు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రీలర్ల అసోషియేషన్‌ అధ్యక్షుడు రియాజ్‌ మాట్లాడుతూ చర్కా రీలర్లకు ఇస్తున్న ఇన్‌సెంటివ్‌లను రూ.35 నుంచి రూ.100కు పెంచాలని కోరారు. కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా కిలో సీబీ పట్టుగూళకు రూ.30 ఇన్‌సెంటివ్‌ అందించాలన్నారు. నగదు రహిత లావాదేవీల నుంచి రీలర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. కమిషనర్‌ స్పందించి ఇన్‌కంట్యాక్స్‌ అధికారులతో సమావేశం నిర్వహించాలని జేడీ అరుణకుమారికి ఆదేశించారు.  

ఆరు జిల్లాల అధికారులతో సమీక్ష
పట్టు పరిశ్రమశాఖకు చెందిన నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల అధికారులతో చిరంజీవ్‌ చౌదరి కిరికెర పట్టుపరిశోధన కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. పట్టు సాగు, వసతులు, నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాల వారీగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలోకి అధికారులు వెళ్లి పట్టు పురుగుల పెంపకంపై రైతులకు శిక్షణ అందించాలన్నారు. అధిక దిగుబడులు సాధించిన రైతుల వివరాలను సేకరించి వారి అవలంభిస్తున్న పద్ధతులను ఇతర రైతులకు తెలపాలని సూచించారు. కార్యక్రమంలో చిత్తూరు జేడీ సుమన, అనంతపురం జేడీ అరుణకుమారి, డీడీ సదాశివరెడ్డి, కర్నూలు డీడీ సత్యరాజ్, కిరికెర పట్టుపరిశోధన కేంద్ర డైరెక్టర్‌ డాక్టర్‌ రాజు, ఆరు జిల్లాల ఏడీలు, పట్టుపరి««శ్రమ అధికారులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు