లైంగికదాడి, హత్య కేసులో...

22 Jun, 2016 02:13 IST|Sakshi

నెల్లూరు(లీగల్) : కోడలిపై మామ లైంగికదాడి చేసి హత్య చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు నెల్లూరులోని మైపాడు రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ కాలేషాకు జీవిత ఖైదుతోపాటు నూ.1500ల జరిమానా, భర్త షేక్.రహిమాన్‌కు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.500లు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్యామలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు.
 
ప్రాసిక్యూషన్ కథనం మేరకు..
వేణుగోపాల్‌నగర్‌కు చెందిన రసూలమ్మ అలియాజ్ రసూలితో అదే ప్రాంతానికి చెందిన షేక్ రహిమాన్‌కు 2008లో పెద్దల సమక్షంలో వివాహమైంది. రహిమాన్ చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధించడం, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టేసేవాడు. భర్తతోపాటు మామ కాలేషా, అత్త ఖాదర్‌బీలు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి రూ.50వేలు రొక్కాన్ని తీసుకు  రమ్మని వేధించారు. ఆమె విషయాన్ని తన అన్న మస్తాన్‌బాబాకు చెప్పింది. మస్తాన్‌బాబు వారికి నచ్చజెప్పి వెళ్లారు.

రహిమాన్ తన కాపురాన్ని వేణుగోపాల్‌నగర్ నుంచి రాజీవ్‌గాంధీ ప్రాంతంలోకి మార్చాడు. కోడలిని మామ తన కోరిక తీర్చమని అడుగుతుండేవాడు. ఆమె నిరాకరిస్తూ ఉండేది. అదును కోసం కాచుకొని ఉన్నాడు. 22-08-2012న భర్త రహిమాన్ , మామ  పనికి వెళ్లారు. వెళ్లిన గంటకే మామ తిరిగి ఉంటికి వచ్చేశాడు. అదే అదునుగా భావించి కోడలిపై అఘాయిత్యం చేయబోగా ఆమె కేకలు వేయడంతో ఒక చేత్తో నోరుమూసి రెండో చేత్తో కడుపులో గుద్ది మంచంపై పడేసి లైంగికదాడికి యత్నించాడు.

ఆమె పారిపోయేందుకు ప్రయత్నించింది. ఇంతలో మంచం కోడుతో ఆమె తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి చీరను మెడకు వేసి వేలాడదీసి వెళ్లాడు. అనంతరం భర్త రహిమాన్, మామ కాలేషా ఇద్దరూ సాయంత్రం 4గంటలకు ఇంటికి చేరుకున్నారు. వారి ముందు మామ ఆమెను కిందకి దింపి చీరను తొలగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మృతురాలు సోదరుడు మస్తాన్‌బాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2వ నగర పోలీసులు మామ షేక్ కాలేషా, భర్త రహిమాన్, అత్త షేక్ ఖాదర్‌బీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

విచారణలో మామ కాలేషాపై అత్యాచారం, హత్యానేరాల కింద నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు, జరిమానా, భర్త రహిమాన్‌పై వేధింపుల కేసు రుజువు కావడంతో ఏడాది జైలు, జరిమానా, అత్త ఖాదర్‌బీపై నేరం రుజువుకాకపోవడంతో ఆమెపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ కేబీఎస్ మణి కేసు వాదించారు.

మరిన్ని వార్తలు