ఆత్మకూరు : మండలంలోని వై.కొత్తపల్లి వద్ద శనివారం 70 సంవత్సరాల వయసు కల్గిన వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆత్మకూరు ఎస్ఐ దిలీప్కుమార్ తెలిపిన వివరాల మేరకు .... కళ్యాణదుర్గం మండలం మద్దినాయనపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు శనివారం ఆత్మకూరు మండలం వై. కొత్తపల్లి గ్రామానికి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అటు వైపు వచ్చి తాము కొత్తపల్లి గ్రామానికే వెళ్తున్నామని కారులో ఎక్కించుకున్నారు.
కొత్తపల్లి గ్రామం దాటాక వాహనం ఆపమని ఆ వృద్ధురాలు కోరగా వారు వినకపొగా అత్యాచారానికి యత్నించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటుగా దారి వెంట వస్తున్న కొందరు కారును ఆపడానికి ప్రయత్నించారు. దీంతో వారు ఆ వృద్ధురాలిని వాహనంలో నుంచి కిందకి తోసి వెళ్లిపోయారు. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పొలాల్లో ఉన్న వారు 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.