కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రజా ఉద్యమాలకు పదును పెట్టాలని సీపీఎం సీనియర్ నాయకులు టి. నరసింహయ్య పిలుపునిచ్చారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన సీపీఎం కార్యకర్తల రాజకీయ తరగతులను ఆయన మంగళవారం ప్రారంభించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి. రమేష్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి బీజేపీ, టీడీపీలు పాలన సాగిస్తున్నాయన్నారు. మతోన్మాద ధోరణులను పాలకులు పెంచుతున్నారని, ప్రజలను మతాల ప్రాతిపదికన విభజించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తరగతుల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంవీఎస్ శర్మ, రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ జీ ఓబులు, రాష్ట్ర కమిటీ సభ్యులు టీ షడ్రక్, కర్నూలు, అనంతపురం జిల్లాల పార్టీ కార్యదర్శులు కే ప్రభాకర్రెడ్డి, వీ రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.