నేటి నుంచి నాటిక సంరంభం

21 May, 2017 00:21 IST|Sakshi
నేటి నుంచి నాటిక సంరంభం
 భీమవరం : జాతీయ స్థాయి నాటిక సంరంభానికి భీమవరం వేదిక కానుంది. స్థానిక చైతన్యభారతి సంగీత, నృత్య, నాటక పరిషత్‌ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించే పద్మభూషణ్‌ డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్మారక పోటీలు ఆదివారం  నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక డీఎన్నార్‌ కళాశాల ఆవరణలో పోటీలకు వేదికను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.  వీటిల్లో అనేకమంది సినీ, నాటక రంగ ప్రముఖులను వివిధ వర్గాలవారిని సత్కరించడం ఆనవాయితీ.  
ఈ ఏడాది సన్మాన గ్రహీతలు వీరే.. 
నాటిక పోటీల ప్రారంభం సందర్భంగా  ఆదివారం రాత్రి  ప్రముఖ సినీ దర్శక, రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్,  సీనియర్‌ సినీ, టీవీ, రంగస్థల నటుడు వంకాయల సత్యనారాయణ, నటుడు, దర్శకుడు గంగోత్రిసాయిని సత్కరించనున్నారు.  
ప్రముఖుల రాక
పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్రమంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, భూమా అఖిలప్రియ, ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ మహిళా మోర్చా ఇన్‌చార్జ్‌  దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతోపాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక, రంగస్థల, ప్రజాసంఘాల ప్రముఖులు హాజరవుతారని  చైతన్యభారతి అధ్యక్షుడు రాయప్రోలు భగవా చెప్పారు. 
సైకత శిల్పం నాటిక ప్రదర్శన
తొలి రోజు ఆదివారం  రాత్రి 9.30 గంటలకు కళారాధన(నంద్యాల)  ఆధ్వర్యంలో ‘సైకత శిల్పం’ నాటికను ప్రదర్శిస్తారు. ఈ నాటికకు రచన  తాళాబత్తుల వెంకటేశ్వరరావు. దర్శకత్వం డాక్టర్‌ జి.రవికృష్ణ.  
 
>
మరిన్ని వార్తలు