శ్రావణ కిరణం

5 Aug, 2016 00:52 IST|Sakshi
శ్రావణ కిరణం
  • 21 ఏళ్లకే సీఏ పట్టా అందుకున్న విద్యార్థి
  • పరకాల :  ప్రస్తుత కాలంలో చాలామంది విద్యార్థులు పదో తరగతి పూర్తికాగానే ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులను అభ్యసించేందుకు వెళ్తుంటారు. మరికొందరు మెడిసిన్, ఇంజినీరింగ్‌ను పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఆరాటపడుతుంటారు. అయితే ఓ విద్యార్థి మాత్రం అందరిలా సంప్రదాయ కోర్సులను చదవకుండా భిన్నంగా, ఎంతో కష్టతరంగా ఉండే చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)ను అభ్యసించేందుకు ఆసక్తి చూపాడు. ఈ మేరకు తాను ఎంచుకున్న కోర్సును చిరుప్రాయంలోనే విజయవం తంగా పూర్తి చేసి పలువురు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన  గంజి పద్మ, వెంకట్‌రెడ్డి దంపతులకు కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వెంకట్‌రెడ్డి ఉద్యోగరీత్యా కొన్నేళ్ల క్రితం పరకాలకు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన నగర పంచాయతీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
    చిన్నప్పటి నుంచే ఫస్ట్‌..
    వెంకటరెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు శ్రావణŠ కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. 1995 ఆగస్టు 7వ తేదీన జన్మించిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి 1 నుంచి 8వ తరగతి వరకు పరకాలలోనే చదివాడు. 8 నుంచి 10వ తరగతి వరంగల్‌ ఎస్‌పీఆర్‌లో పూర్తి చేశాడు. కాగా, 2010లో పదో తరగతి ఫలితాల్లో ఆయన 600 మార్కులకు 538 సాధించి ప్రతిభ కనబరిచాడు.  2012లో ఎంఈసీ గ్రూపులో 1000కి 937 మార్కులు సాధించాడు. అనం తరం సీపీటీలో ప్రవేశ పరీక్ష రాయగా 200 మార్కులకు 172 మార్కులను సాధించాడు. అలాగే ఐపీసీసీలో 700 మార్కు లకు 385 మార్కులను సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత రెండేళ్ల పాటు ప్రముఖ ఆడిటర్‌ తిప్పర్తి రాఘవరెడ్డి దగ్గర అప్రెంటీస్‌ పూర్తి చేశాడు. 
    మంచి మార్కులతో 
    సీఏ ఉత్తీర్ణత
    గత మే నెలలో జరిగిన సీఏ ఫైనల్‌ పరీక్షకు హాజరైన శ్రావణ్‌కుమార్‌రెడ్డి 800 మార్కులకు 479 మార్కులు సాధించాడు. మెుత్తం మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. కాగా, గత ఏడాదిలో శ్రావణ్‌కుమార్‌రెడ్డి సాధించిన 479 మార్కులకు ఆలిండియా ర్యాంకు రాగా.. ఇప్పుడు త్రుటిలో జాతీయ ర్యాంకు కోల్పోయాడు. ఇదిలా ఉండగా, సీఏ గ్రూపు–1, గ్రూపు–2లో మొత్తంగా 8 సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిలో ఏ ఒక్క సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చిన సీఏలో అనర్హుడిగానే పరిగణిస్తారు. కానీ.. శ్రావణ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఒకేసారి 8 సబ్జెక్ట్‌లను రాసి మొదటి శ్రేణిలో పాస్‌ కావడం విశేషం. ఎంతో కష్టమైన సీఏ కోర్సును చిన్న వయస్సులోనే పూర్తి చేసి రికార్డు సాధించిన శ్రావణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందిస్తున్నారు.
    కష్టమని తెలిసే ఎంచుకున్నా.
    ఇంటర్‌ తర్వాత చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్‌ కోర్సులను అభ్యసించేందుకు ఆరాటపడుతుంటారు. నాకు మొదటి నుంచి గణితం, సైన్స్‌లో 98 శాతం మార్కులు వచ్చేవి. దీంతో ఇంట్లో అందరు నన్ను ఇంజినీరింగ్‌ చేయాలని ఒత్తిడి చేశారు. నాకు మాత్రం సీఏ చేయాలనే ఉండేది. సమాజంలో సీఏలకు మంచి గౌరవం ఉంటుంది. అందుకనే ఆ కోర్సును పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నా.  సీఏ చదివేందుకు అమ్మనాన్న నాకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. మా సార్‌ రాఘవరెడ్డి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సహంతో మొదటి ప్రయత్నంలోనే సీఏను సాధించాను. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివినందుకే ఫలితం వచ్చింది.
    –గంజి శ్రావణ్‌కుమార్‌రెడ్డి  
మరిన్ని వార్తలు