ఫోర్జరీ సంతకంతో బ్యాంకులో డబ్బులు డ్రా

10 Aug, 2016 17:43 IST|Sakshi

సంతకానికి బదులు వేలిముద్ర వేసి పట్టుబడిన వైనం
బ్యాంకు సిబ్బందిపై అనుమానం
దర్యాప్తు చేస్తున్న ఇంటలిజెన్స్‌ అధికారులు
యర్రగొండపాలెం(ప్రకాశం జిల్లా):
మండలంలోని అమానిగుడిపాడులోని ఒక గ్రామీణ బ్యాంకులో ఫోర్జరీ సంతకంతో డబ్బులు డ్రా చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయంపై ఇంటలిజెన్స్‌ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కొలుకులకు చెందిన ఒక వ్యక్తి ఖాతాలోని రూ. 20 వేలు డ్రా చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఖాతాదారుడు మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అతనికి సంతకం చేయడంరాదని భావించి వేలిముద్ర వేసుకొని ఆ డబ్బును కాజేశారు. ఆ అకౌంట్‌ ఖాతాలో సంతకం చేసి ఉండటం వల్ల ఆ బ్యాంకు రీజనల్‌ కార్యాలయంలో ఈ విషయాన్ని గుర్తించారు. బ్యాంకు సిబ్బంది హస్తం లేకుండా ఆ డబ్బు డ్రా చేసుకునే అవకాశం లేదని ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసును ఆ బ్యాంకు ఉన్నతాధికారులు ఇంటలిజెన్స్‌ అధికారులకు అప్పచెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వారు అమానిగుడిపాడు వచ్చి దర్యాప్తు చేపట్టారు. వేలిముద్రలు వేసి ఉన్న ప్లే స్లిప్‌తో పాటు ఖాతాదారుడి వేలిముద్రలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. బ్యాంకు సిబ్బందే వేలిముద్రలు వేసుకొని డబ్బును డ్రా చేసుకొని ఉంటారని ఆ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారుడు సంతకం చేయడం మరచిపోయి వేలిముద్ర వేసుకొని డబ్బులు డ్రా చేశాడని, పనివత్తిడి వల్ల తాము ఈ విషయం గమనించలేక పోయామని ఆ బ్యాంకుకు చెందిన సిబ్బంది చెప్తున్నట్లు తెలిసింది. ఈ పోర్జరీ వ్యవహారం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి రిపోర్టు వచ్చిన తరువాత వాస్తవం ఏమిటో బయట పడుతుంది. సంబంధిత బ్యాంకు అధికారులు ఈ విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు.

మరిన్ని వార్తలు