టీబీజీకేఎస్‌కు కొత్త నాయకత్వం..?

17 Aug, 2016 14:16 IST|Sakshi
టీబీజీకేఎస్‌కు కొత్త నాయకత్వం..?
  సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై టీఆర్‌ఎస్ దృష్టి
  18న హైదరాబాద్‌లో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో సమావేశం
  సమీకరణలు చేస్తున్న సీఎం కేసీఆర్
 
కొత్తగూడెం (ఖమ్మం) : సింగరేణిలో ప్రస్తుతం గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న టీబీజీకేఎస్‌ను మరోసారి గెలిపించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు యూనియన్ నాయకత్వంలో భారీ మార్పులు చేపట్టి ఎన్నికలకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌లో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి యూనియన్‌లో నాయకత్వ మార్పు చేయాలని పార్టీ అధిష్టానం చూస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఈ మేరకు ఆయా సంఘాలన్నీ బొగ్గు గని కార్మికులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాగా, ఇప్పటికే పిట్ మీటిం గ్‌లతో కార్మికుల సమస్యల పరిష్కారం, వారు సాధించిన హక్కులను కార్మికులకు పదే పదే తెలియజేస్తూ ఊదరగొడుతున్నారు. అయితే ప్రస్తుతం గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న టీబీజీకేఎస్‌పై కార్మికవర్గం కొంతమేరకు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో తిరిగి ఎన్నికల్లో దానిని విజయపథంలో నడిపించేందుకు నాయకత్వ మార్పు అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్మికుల సొమ్మును పక్కదారి పట్టించారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డిపై ఆరోపణలు వచ్చారుు. కాగా, గతంలో కూడా వర్గపోరు కారణంగా అనేక కుమ్ములాటలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై చివరకు కోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అరుుతే గతంలో గుర్తింపు సంఘంగా గెలిచినప్పటికీ సుమారు ఏడాదిన్నరపాటు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో టీబీజీకేఎస్ విఫలమైందనే విమర్శలు కూడా ఉన్నారుు.
 
తెరపైకి కొత్త వ్యక్తులు..!
టీబీజీకేఎస్‌లో ప్రస్తుతం నాయకత్వలోపం ఉందని భావిస్తున్న పార్టీ అధిష్టానం యూనియన్ నాయకత్వాన్ని కొత్త వ్యక్తులకు అప్ప గించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతూ ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వెంకట్రావును యూనియన్‌లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే గత గుర్తింపు సంఘం ఎన్ని కల్లో యూనియన్‌ను గెలిపించేందుకు కృషి చేసిన కెంగెర్ల మల్లయ్యను కూడా తిరిగి యూనియన్‌లోకి ఆహ్వానించేందుకు సిద్ధమైనట్లు సమా చారం. వీరితోపాటు మరికొంత మంది ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లను కూడా పరిశీలిస్తూ వారితో కొత్తగా కమిటీని నియమించాలని టీఆర్ ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయూన్ని యూనియన్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నాయకత్వ మార్పుపై చర్చించినట్లు తెలిసింది. కాగా, త్వరలో జరుగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావును, ప్రధాన కార్యదర్శిగా కెంగెర్ల మల్లయ్యను, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆకునూరి కనకరాజును నిలబెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజిరెడ్డికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది స్పష్టం కాలేదని సమాచారం. ఈ మేరకు యూనియన్‌లో కూడా ఈ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది.
 
 రేపు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ...?
 సెప్టెంబర్ చివరి కల్లా గుర్తింపు సంఘం ఎన్నికలు పూర్తి చేసేందుకు సింగరేణి యాజమాన్యం కసరత్తు ప్రారంభిం చిన నేపథ్యంలో గురువారం సీఎం కేసీఆర్ కోల్‌బెల్ట్ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ కానున్నట్లు సమాచా రం. కాగా, ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు కల్పించిన హక్కులు, లాభాల వాటా, సకలజనుల సమ్మె వేతనం, వివిధ పండుగల అడ్వాన్స్‌ల పెంపు తదితర అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. వీటిని కార్మికుల వద్దకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యూహరచన చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కోల్‌బెల్ట్ ప్రాంతంలోని ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా రంగంలోకి దింపి ఆయా ప్రాంతాల్లోని కార్మికవర్గాన్ని ఆకర్షించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి టీబీజీకేఎస్‌లో నాయకత్వ మార్పు తప్పదని తెలుస్తోంది.
>
మరిన్ని వార్తలు