కారణజన్ముడు కాటన్‌

15 May, 2017 23:09 IST|Sakshi
కారణజన్ముడు కాటన్‌
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌
పలువురికి సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ జీవిత సాఫల్య పురస్కారాలు అందజేత
రాజమహేంద్రవరం రూరల్‌ : ఒక ఆంగ్లేయుడు భారతీయుల యోగక్షేమాలు కోసం పరితపించడం మామూలు విషయం కాదని, సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నిజంగా కారణజన్ముడని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ, తెలుగు యూనివర్సిటీ సంయుక్తంగా కాటన్‌ 214వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉండవల్లి మాట్లాడుతూ ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీర«ధుడు కాటన్‌ అని కొనియడారు.
 ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజయోనా స్వాగతం పలుకగా, ఇండియన్‌ నర్సరీ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన సాహిత్య పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ మాట్లాడుతూ కాటన్‌ మహిమాన్వితుడని కొనియడారు. అందుకే ఆయన కీర్తి భారతదేశ నదీజలాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అంతర్లీనమై కలకాలం నిలిచే ఉంటుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చెరుకూరి వెంకట రామారావు, తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్, బొమ్మూరు మాజీ సర్పంచి మత్సేటి ప్రసాద్, సీనియర్‌ పాత్రికేయులు ఎం.శ్రీరామ్మూర్తి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి కొల్లివెలసి హారిక, డాక్టర్‌ పి.హేమలత  మాట్లాడారు. వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులకు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ జీవిత సాఫల్య పురస్కారాలు అందించారు.
పురస్కార గ్రహీతలు వీరే
పల్ల వెంకన్న (కడియం), ఆచార్య ఎండ్లూరి సుధాకర్, దూలం రాజ్‌కుమార్‌(పొట్టిలంక), సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి, దుళ్ల), తుమ్మిడి అరుణ్‌కుమార్‌(రాజమహేంద్రవరం), డాక్టర్‌ గుబ్బల రాంబాబు (స్వర్ణాంధ్ర సేవా సంస్థ), బొంతు శ్రీహరి (సఖినేటిపల్లి), డాక్టర్‌ మానికిరెడ్డి సత్యనారాయణ (కాకినాడ), కర్రా వెంకటలక్ష్మి (ఎంపీపీ, వై.రామవరం), ఇసుకపట్ల ఇమ్మానియేలుకుమార్‌ (అన్నా మినిస్ట్రీస్, రావులపాలెం), అలమండ ప్రసాద్‌(కూచిపూడి నృత్య కళాకారుడు, సామర్లకోట), రహీమున్నీసాబేగం(విశాఖ), తురగా సూర్యారావు (కాకినాడ), కొచ్చెర్ల చక్రధారి(సూక్ష్మకళాకారుడు, సామర్లకోట), డాక్టర్‌ బీఎస్‌ఎస్‌ఏ జగదీష్‌(టీచర్, సామర్లకోట), శివకోటి విజయప్రసాద్‌ (మ్యుజీషియన్, కాకినాడ), పొట్నూరి రజనీకాంత్‌ (ఏలూరు), ప్రత్తి రామలక్ష్మణమూర్తి (టీచర్, పిఠాపురం), పి.కీర్తిప్రియ (కూచిపూడి నర్తకి, శ్రీకాకుళం), గరికిపర్తి నమశ్శివాయ (కాకినాడ), ముష్ఠి శ్రీదేవి (వెదురుపాక)లను జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, పతకాలతో ఘనంగా సత్కరించారు.
మరిన్ని వార్తలు