తిప్పిరెడ్డిపల్లెలో అస్తిపంజరం లభ్యం

23 Aug, 2016 23:11 IST|Sakshi

తిప్పిరెడ్డిపల్లె(చాపాడు):
చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో మంగళవారం సాయంత్రం ఓ రైతు పొలంలో ట్రాక్టర్‌తో చదును చేస్తుండగా ఓ మనిషికి చెందిన అస్తిపంజరం బయట పడింది. గ్రామస్తుల కథనం మేరకు.. పెన్నానది సమీపంలో ఓ పొలంలో ట్రాక్టర్‌తో చదును చేస్తుండగా కట్టిపెట్టిన గోనె సంచి బయట పడింది. ఈ సంచిలో మనిషికి చెందిన అస్తికలు ఉన్నాయి. రెండున్న రేళ్ల క్రితం తిప్పిరెడ్డిపల్లెలో కన్పించకుండా పోయిన అన్నారపు సుబ్బరాయుడుకు చెందిన అస్తిపంజరంగా స్థానికులు భావిస్తున్నారు.

అప్పట్లో తన అన్న కన్పించడం లేదని తమ్ముడు చిన్న సుబ్బరాయుడు చాపాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదైంది. అయితే సుబ్బరాయుడు భార్య లక్ష్మీదేవితో పాటు ఇంకా పలువురిపై అనుమానంతో పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అయినా ఎలాంటి పురోగతి లేదు. ఈ క్రమంలో మంగళవారం తిప్పిరెడ్డిపల్లె సమీపంలోనే గోనె సంచిలో అస్తికలు కన్పించటంతో అన్నారపు సుబ్బరాయుడును అప్పట్లో చంపి పాతిపెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే చాపాడు, కమలాపురం మండలాల సరిహద్దుల్లో ఈ పొలాలు ఉండటంతో స్థల సరిహద్దులను గుర్తించిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఎస్‌ఐ శివశంకర్‌ తెలిపారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు