స్మార్ట్‌కార్డుకు ‘రిబ్బన్‌’ ఎఫెక్ట్‌

23 Dec, 2016 10:52 IST|Sakshi
స్మార్ట్‌కార్డుకు ‘రిబ్బన్‌’ ఎఫెక్ట్‌
  • రవాణాశాఖలో నెలరోజులుగా సమస్య
  • నిలిచిపోయిన డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీల జారీ
  • సాక్షి, సిటీబ్యూరో: ‘స్మార్ట్‌కార్డు’.. రవాణాశాఖలో నూతన అధ్యాయం.. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్‌ పూర్తయిన అనందరం వినియోగదారుల, వాహనాల వివరాలు ముద్రించి అందించాలి. కానీ నెలరోజులుగా ఈ కారులు సంబందిత వాహనదారుకులకు మాత్రం అందడం లేదు. కొద్ది రోజుల క్రితం ఆర్టీఏ కార్యాలయాలకు తెలుపు (వైట్‌) కార్డులు అందాయి. కానీ వాటిపై అక్షరాలను ముద్రించే రిబ్బన్‌ మాత్రం సరఫరా కాలేదు. దీందో స్మార్ట్‌కార్డుల పంపిణీ సాధ్యపడలేదు. నెలరోజులుగా ఇదే సమస్య కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్మార్డుకార్డులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో డ్రైవింగ్‌ పరీక్షలు ముగించుకొని లైసెన్సులు పొందాల్సినవారు, వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసినప్పటికీ స్మార్డ్‌ కార్డులు చేతికి రాక వాహనదారులు ఎదురు చూస్తున్నారు.

    గ్రేటర్‌ పరిధిలోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాలతో పాటు, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సకాలంలో స్మార్ట్‌కార్డులు అందక వాహన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కార్డులు ప్రింట్‌ చేసేందుకు కావలసిన రిబ్బన్‌ సింగపూర్‌ నుంచి దిగుమతి కావాల్సి ఉండగా, తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీస్‌ (టీఎస్‌టీఎస్‌) విభాగం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటిదాకా డిమాండ్‌కు తగిన స్థాయిలో రిబ్బన్‌ అందలేదు. దీనివల్ల కార్డుల ప్రింటింగ్, పంపిణీలో జాప్యం జరుగుతోందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

    నెల నుంచి ప్రతిష్టంభన..
    డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ పత్రాలను వాహనదారులకు కొంతకాలంగా స్మార్ట్‌కార్డుల రూపంలో అందజేస్తున్నారు.  కార్డులోనే వాహనదారుడికి, వాహనానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రింట్‌ చేస్తారు. వాహనదారుడి చిరునామా, డ్రైవింగ్‌ లైసెన్సు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెల్లుబాటులో ఉంటుంది.. తదితర వివరాలన్నీరుంటాయి. రిజిస్ట్రేషన్‌ స్మార్టుకార్డుల్లోనూ వాహనం మోడల్, రిజిస్ట్రేషన్‌ తేదీ, రిజిస్ట్రేషన్‌ నెంబర్, చిరునామా ప్రింట్‌ చేస్తారు. ఇలా ప్రింట్‌ అయిన కార్డులను వారం రోజుల్లోపు వినియోగదారుడికి పోస్టులో చేరాలి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో రోజుకు సుమారు 5000 మంది డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ల కోసం హాజరవుతుండగా, తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో ఈ సంఖ్య 7 వేల నుంచి 8 వేల వరకు ఉంటుంది. అయితే, నెల రోజుల నుంచి కార్డుల ప్రింటింగ్‌ నిలిచిపోయింది. ఈనెల రోజుల్లో లక్షకు పైగా కార్డుల ముద్రణ, పంపిణీ ఆగిపోవడంతో వాహనదారులకు సమస్యలు తప్పడం లేదు.

    నిలిచిపోయిన రిబ్బన్‌ దిగుమతి..
    రవాణాశాఖకు సరఫరా చేసే స్మార్టు కార్డులను తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీస్‌ సరఫరా చేస్తోంది. కార్డుల తయారీని కాంట్రాక్ట్‌ పద్ధతిలో చేపట్టారు. నెలక్రితం సదరు కాంట్రాక్టర్‌ గడువు ముగియడం, సింగపూర్‌ నుంచి దిగుమతి కావలసిన రిబ్బన్‌ సైతం ఆగిపోవడంతో ఆకస్మాత్తుగా సమస్య తలెత్తింది. కొత్త కాంట్రాక్టర్‌ వచ్చే వరకు పాత కాంట్రాక్టర్‌ వ్యవస్థనే కొనసాగిస్తూ వారం క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సుమారు 50 వేల వరకు కార్డులు రవాణాశాఖకు అందాయి. మరో 50 వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సైతం  అక్షరాలు ప్రింట్‌ చేసేందుకు కావలసిన రిబ్బన్‌ లేదు.

    ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో 7000 కార్డులు పెండింగ్‌లో ఉండగా 5000 మాత్రం పంపిణీ చేశారు. ఇక్కడ 10 రిబ్బన్‌లు అవసరముండగా 5 మాత్రమే అందాయి. మరోవైపు ఇప్పటికిప్పుడు వాహనదారుల డిమాండ్‌ను పరిష్కరించేందుకు కొంత మేరకు స్మార్ట్‌కార్డులు అందుబాటులో ఉన్నా వాటిపైన వివరాలను ముద్రించేందుకు కావలసిన రిబ్బన్‌లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని  పలువురు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు