మచిలీపట్నం : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ మచిలీపట్నం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం పీఆర్టీయు నాయకులు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మంత్రి కొల్లు రవీంద్రను కలుసుకుని వినతిపత్రం అందజేశారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 26న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద పీఆర్టీయూ నాయకులు ధర్నా నిర్వహించనున్నట్లు మత్తి కమలాకరరావు వెల్లడించారు. నవంబరు 18న విజయవాడలో మహాధర్నా చేస్తామన్నారు. సీపీఎస్ రద్దు, కామన్ సర్వీస్ రూల్స్ తదితర అంశాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేయనున్నట్లు చెప్పారు. వినతిపత్రం అందజేసిన వారిలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు జీఎస్ పెరుమాళ్లు, కార్యదర్శి అప్పినేడి వెంకట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.