హన్వాడ(మహబూబ్నగర్): నగల కోసం తల్లిని చంపాడో కిరాతకుడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం తిరుమలగిరిలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పత్తెపురం పెంటయ్య, చెన్నమ్మ(55) దంపతులు. వీరి ఏకైక కొడుకు కిష్టయ్య. ఆదివారం ఉదయం పెంటయ్య తన అత్తగారి గ్రామమైన గండీడ్ మండలం చౌదర్పల్లికి వెళ్లాడు. రాత్రి తిని పడుకునే సమయంలో చెవిగంటీలు తీసి ఇవ్వాలని కిష్టయ్య తన తల్లి చెన్నమ్మపై ఒత్తిడి పెంచాడు.
ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన కిష్టయ్య.. విపరీతంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం తల్లి చెవులను కొడవలితో కోసి గంటీలను తీసుకెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో చెన్నమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. సోమవారం ఉదయం పెంటయ్య రావడంతో ఈ ఘటన వెలుగుచూసింది. కాగా, నిందితుడు కిష్టయ్య క్రూరుడని, ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ఇతని ప్రవర్తన కారణంగా భార్యలు ఉండడం లేదని గ్రామస్తులు తెలిపారు.