అమ్మా.. నీకెంత కష్టం!

20 Sep, 2017 11:17 IST|Sakshi
పార్వతమ్మను జీపులో తరలిస్తున్న దృశ్యం.. (ఇన్‌సెట్‌) దుఃఖిస్తున్న పార్వతమ్మ

దుర్గి మండలం ఆత్మకూరులో
కన్నతల్లిని బయటకు గెంటేసిన కుమారుడు
వీధుల్లో యాచిస్తూ కడుపు నింపుకుంటున్న దైన్యం..


పున్నామ నరకాల నుంచి తప్పించేవారు పుత్రులంటారు పెద్దలు.. కాన్నీ బతికి ఉన్నప్పుడే తల్లిదండ్రులకు నరకం చూపించే ప్రబుద్ధులూ కొందరుంటారు.. కాటికి కాలు చాపిన వయస్సులో కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఆస్తులు తీసుకుని మరీ అమ్మను బయటకు గెంటేశాడో కొడుకు. దిక్కుమొక్కులేని ఆ అవ్వ కడుపు చేతిన పట్టుకుని వీధి వీధిన భిక్షమెత్తుకుని కడుపునింపుకుంటోంది. ముద్ద దొరికినప్పుడు తిని, దొరకనప్పుడు కన్నీళ్లు దిగ మింగి బతుకీడుస్తోంది. చలి వేస్తే వణికిపోతూ.. వానొస్తే తడుస్తూ అల్లాడిపోతోంది. ఈ దుస్థితి దుర్గి మండలానికి ఓ అవ్వకు నిత్యకృత్యమైంది.  

దుర్గి : మండలంలోని ఆత్మకూరుకు చెందిన మూటైన పార్వతమ్మకు ముగ్గురు కుమారులు. ఇప్పుడామె వృద్ధురాలు. ఆమె జీవితం భర్త జీవిం చి ఉన్నప్పుడు కూటికి గూటికి లోటు లేకపోయింది. భర్త మరణించిన తర్వాత ముగ్గురు కుమారులు ఆస్తిని పంచుకున్నారు. ఆమె సాధకబాధకాలు చూడటానికి 1.5 ఎకరాల భూమి, ఒక మట్టి మిద్దె ఇచ్చి చిన్నకుమారుడు పుల్లయ్యకు బాధ్యతలు అప్పగించారు. కుమారుడు దయాదాక్షిణ్యాలు మరచి భూమిని అనుభవిస్తూ తల్లిని వదిలేశాడు. పింఛను కూడా రాకపోవడంతో దిక్కులేని పక్షి అయింది. గత్యంతరం లేని వృద్ధురాలు ఆత్మకూరు అనాథ శరణాలయాన్ని ఆశ్రయించింది.అక్కడ కూడా ఉండనీయకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో దుర్గిలో భిక్షాటన మొదలుపెట్టింది. రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ దుకాణాల ఎదుట ఉన్న ఖాళీ స్థలాల్లో నిద్రిస్తోంది. చలికి వణుకుతూ.. వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తోంది.

స్పందించిన ఎస్సై..
దుర్గి ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు ఆమె దైన్యాన్ని గమనించి ఆమె ఫొటోలు తీసి వాట్సప్‌లో పలు సందేశాలు పంపిం చారు. సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై సుబ్బనాయుడు వెంటనే స్పం దంచి మంగళవారం ఉదయం ఆమె ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొడుకును పిలిపించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీడీవో అజ్మి రా దేవిక స్పందించి పింఛను ఇప్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏదైతేనేం మలి దశలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉండగా కన్నపేగే ఇలా బయటకు వదిలేయడం చూసిన వారి హృదయాలను  కలచివేసింది.

మరిన్ని వార్తలు