-
మలేరియా అధికారి వేణుగోపాల్రెడ్డి
సైదాపురం: జిల్లాలో ప్రబలిన మలేరియా జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా మలేరియా నివారణాధికారి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. సైదాపురం ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మండలంలోని పోతేగుంట గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సైదాపురం, డక్కిలి, రాపూరు, ఉదయగిరి ప్రాంతాల్లో మలేరియా బాధితుల సంఖ్య పెరిగిందన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది జ్వరాలు విపరీతంగా ప్రబలాయన్నారు. మలేరియా జ్వరాల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో మలేరియా నివారణకు సంబంధించి మందులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పు కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పారిశుద్ధ్యం చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వస్తున్న మలేరియా జ్వరాలతో పెద్ద ప్రమాదం లేదన్నారు. సరైన సమయంలో వైద్య పరీక్షలను చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి పాల్ జాన్స్న్, సబ్యూనిట్ అధికారి మురళి ఉన్నారు.