కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైలు

14 Aug, 2016 22:46 IST|Sakshi

రాజంపేట: కృష్ణ పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా తిరుపతి నుంచి జిల్లా మీదుగా కృష్ణా రైల్వేస్టేషన్‌కు జనరల్‌ బోగీలతో ప్రత్యేక రైలు(07054 నంబరు) నడుస్తోంది. పుస్కరాలకు తరలివెళ్లే రైతులు పుష్కర ఘాట్లకు సమీప దూరంలోని కృష్ట రైల్వేస్టేషన్‌ వరకూ రైలు వెళుతుంది. అక్కడి నుంచి ఘాట్లకు సులభంగా చేరుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 11 నుంచి ఈ రైలు నడుస్తోంది.
ఆ నాలుగు రోజుల్లో రైలు లేనట్లే..!
కృష్ణాపుష్కరాల రైలు ఈనెల 15, 20వ తేదీలలో ఇక్కడి నుంచి నడవదు. అలాగే 16, 21వ తేదీల్లో కృష్ణా రైల్వేస్టేషన్‌ నుంచి రైలు నడవదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.  
ఈ స్టేషన్లలో స్టాపింగ్‌
తిరుపతి నుంచి బయలుదేరే రైలు రేణిగుంట, రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు, కడప, ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూరు మీదుగా కృష్ణాకు చేరుకుంటుంది. దీనికి రిజర్వేషన్‌ సౌకర్యం లేదు.
రైలు నడిచే సమయం ఇలా..
 తిరుపతిలో రైలు రాత్రి 11.10 గంటలకు బయలు దేరుతుంది. కడపకు 1.25కు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు కృష్ణా రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కృష్ణా రైల్వేస్టేషన్‌ నుంచి ఉదయం 10 గంటలకు రైలు బయలుదేరి కడపకు 4.25కు, తిరుపతి 7.25 గంటలకు చేరుకుంటుంది.
జయంతి, సూపర్‌పాస్ట్‌కు కృష్ణాలో స్టాపింగ్‌..
కృష్ణా పుష్కరాల సందర్భంగా కన్యాకుమారి నుంచి ముంబయికి నడిచే జయంతి ఎక్స్‌ప్రెస్‌(16381–16382) రైలుకు కృష్ణ రైల్వేస్టేషన్‌లో స్టాపింగ్‌ సౌకర్యం కల్పించారు. అలాగే చెన్నై ఎగ్మోర్‌ నుంచి ముంబయికి నడిచే సూపర్‌పాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12154–12153) రైలుకు కూడా కృష్ణా రైల్వేస్టేషన్‌లో స్టాపింగ్‌ సౌకర్యం కల్పించినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. ఈ స్టాపింగ్‌ ఈనెల 23వ తేదీ వరకు కొనసాగించనున్నారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా కూడా కృష్ణాకు చేరుకోవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు