పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి

19 May, 2017 00:31 IST|Sakshi
పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యాలయాల్లో తప్పనిసరిగా క్రీడాపోటీలు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తొలగించాలని కలెక్టర్‌కాటంనేని భాస్కర్‌ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖా ప్రగతి తీరుపై ఆయన అధికారులతో సమీక్షించారు. జూన్‌12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అన్ని పాఠశాలల్లో క్రీడాప్రణాళికలను రూపొందించి పటిష్టవంతంగా అమలు చేయాలని చెప్పారు. ఆగస్టు 15, అక్టోబర్‌ 2 గాంధీ జయంతి, జనవరి 29 రిపబ్లిక్‌ డే సందర్భంగా కచ్చితంగా స్పోర్ట్స్‌ మీట్స్‌ను నిర్వహించి క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించాలని కలెక్టరు సూచించారు. 600 పాఠశాలల్లో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, ఉపాధి హామీ పథకం కింద గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో వాకింగ్‌ ట్రాక్‌లను నిర్మిస్తామన్నారు. వివిధ వృత్తుల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాలను పాఠశాల టైం టేబుల్‌లో పొందుపర్చాలని తెలిపారు. జూన్‌ 12 నాటికి విద్యార్థులకు రెండు జతల యూనిఫాంతో పాటు అవసరమైన పాఠ్యపుస్తకాలను కూడా అందించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సర్వశిక్షాభియా¯ŒS పీఓ వి.బ్రహ్మానందరెడ్డి, సీఈఓ రూజ్‌వెల్ట్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఈఓ ఆర్‌.గంగాభవాని, ఎస్‌ఎస్‌ఏ పీఓ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు