పాల్వంచ రూరల్ : మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శ్రీ దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం శ్రీ లలితాదేవి అవతారంలో పెద్దమ్మతల్లి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో శ్రీ చక్రాఅర్చన, సూర్యనమాస్కార పూజలు నిర్వహించారు. యాగశాలల్లో అర్చకులు హోమ పూజలు నిర్వహించారు. కాగా, శ్రీ దేవిశరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం కేటీపీఎస్ ఓఅండ్ఎం సీఈ మంగేష్కుమార్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్, ఆలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ సీఈకి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.