రమణీయం.. రామ పట్టాభిషేకం..

17 Aug, 2016 23:08 IST|Sakshi
రమణీయం.. రామ పట్టాభిషేకం..
కమనీయం.. భీమేశుని కల్యాణం ∙
లోకహితం కోసమే : గాడ్‌
వెదురుపాక (రాయవరం) : వెదురుపాక విజయదుర్గా పీఠంలో బుధవారం అటు భద్రాద్రి, ఇటు ద్రాక్షారామల ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. పీఠం 44వ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం పలు పూజలు, అభిషేకాలను పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్‌) సమక్షంలో నిర్వహించారు. భద్రాచలం నుంచి వచ్చిన వేదపండితులు తిరుమడిళై ఆళ్వార్, చక్రవర్తి మోహిత్‌స్వామిల ఆధ్వర్యంలో అక్కడి ఆలయంలో నిర్వహించే మాదిరిగా శ్రీరామ సామ్రాజ్య పాదుకా పట్టాభిషేకాన్ని నిర్వహించారు. పాదుకలు, రాజముద్రిక, రాజదండకం, నందక, ఛత్రచామర, ఆభరణాల సమర్పణ, నదీజలాలు, తీర్థాలు, చతుస్సముద్ర జలాలతో అభిషేకం, మంగళశాసనం తదితర పూజలను నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీరాముని పాలనను, సామ్రాజ్య పాదుకా పట్టాభిషేక ఘట్టాలను వివరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. కాగా రాత్రి ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఉత్సవమూర్తుల కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతం, వస్త్రదానం, మహాసంకల్పం తదితర పూజలను నిర్వహించారు. పీఠం వార్షికోత్సవాల సందర్భంగా లోక కల్యాణ ం కోసమే కల్యాణాలు నిర్వహిస్తున్నట్టు గాడ్‌ చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్‌ కో ఆర్డినేటర్‌ కందర్ప హనుమాన్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కోట సునీల్‌కుమార్, కుతుకులూరు సర్పంచ్‌ సత్తి సూర్యబ్రహ్మానందరెడ్డి, మహోపాధ్యాయ డాక్టర్‌ విశ్వనాథ గో పాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సం స్కృత భాషా వికాసానికి కృషి చేసి రాష్ట్రప తి పురస్కారాన్ని పొందిన  విశ్వనాథను గాడ్‌ సమక్షంలో ఘనంగా సత్కరించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్‌ వి.వి.బాపిరాజు, పీఆ ర్వో వాడ్రేవు వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. 
>
మరిన్ని వార్తలు