తాళ్లపూడి : మండలంలోని అన్నదేవరపేటలో ఓ యువకుడు డెంగీ లక్షణాలతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. ఇందిరమ్మకాలనీకి చెందిన పర్తిపాటి శ్రీకాంత్ (19) కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అతని రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవడంతో నీరసించాడు. దీంతో అతనిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ డెంగీ లక్షణాలతోనే మృతిచెందాడని వివరించారు. వైద్య సిబ్బంది వివరాలను సేకరించి వెళ్లారు. గ్రామానికి చెందిన అంబేడ్కర్ యువజన సంఘాల నాయకులు, వైఎస్సార్ సీపీ నాయకులు పిట్టా శ్రీనివాస్ , పోలుమాటి విజయ్ ,అజయ్ తదితరులు శ్రీకాంత్ మృతికి సంతాపం తెలిపారు.