శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం 420 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి నీటిని విడుదల ప్రారంభించినప్పటికీ బుధవారం నుంచి పూర్తిస్థాయిలో ఎత్తిపోతల పథకానికి నీటిని అందిస్తున్నారు. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా విడుదల చేసే 2వేల క్యూసెక్కుల నుంచి 500 క్యూసెక్కులను తగ్గించి 1500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తగ్గించిన స్థానంలో ముచ్చుమర్రి ఎత్తి పోతలకు 420 క్యూసెక్కులను వదులుతున్నారు. హంద్రీనివా సుజలస్రవంతికి యథావిథిగా 2025 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆంధ్ర ప్రాంతంలోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.664 మిలియన్ యూనిట్లు, తెలంగాణా ప్రాంతంలోని ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.392 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 5,849 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 102.4060 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 858.80 అడుగులకు చేరుకుంది.