ముగిసిన రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలు

19 Jun, 2017 00:29 IST|Sakshi
= ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచిన ‘విజయవాడ’
= జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు, విజయవాడ క్రీడాకారులు
 
గుంతకల్లు : స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. ర్యాపిడ్‌ విభాగంలో ప్రతిభ చాటిన ఇద్దరు క్రీడాకారులను, బ్లిట్జ్‌ విభాగంలో రాణించిన మరో ఇద్దరు క్రీడాకారులను జాతీయస్థాయి చెస్‌ పోటీలకు ఎంపిక చేసినట్లు  అనంతపురం జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి హేమాద్రి తెలిపారు. ర్యాపిడ్, బ్లిట్జ్‌ విభాగంలో రెండింటిలో గుంతకల్లుకు చెందిన తిరుమలై పురుషోత్తం అత్యధిక పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు.

ర్యాపిడ్‌ విభాగంలో విజయవాడకు చెందిన లక్ష్మణరావు, బ్లిట్జ్‌ విభాగంలో వెంకటకార్తీక్‌ (విజయవాడ) ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ నలుగురు క్రీడాకారులను అండమాన్‌ నికోబార్‌లో  నవంబర్‌లో జరిగే జాతీయ స్థాయి చెస్‌ పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. సాయంత్రం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ మధ్య రైల్వే ఉమెన్స్‌ ఆర్గనైజేషన్‌ గుంతకల్లు డివిజన్‌ ఉపాధ్యక్షురాలు మాధవీలత, కార్యదర్శి రీటా, కోశాధికారి కేథరిన్‌లు హాజరై విజేతలకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.  కార్యక్రమంలో ఉమెన్స్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు అంజుమ్, మాధవి, రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షురాలు ఉమ, రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ కార్యదర్శి సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు