ఉత్కంఠగా రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ

3 Feb, 2017 23:47 IST|Sakshi
ఉత్కంఠగా రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ

ధర్మవరం టౌన్ : పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో ధర్మాంబ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి డైమండ్‌ జూబ్లీ ఓపెన్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ మెమోరియల్‌ హాకీ చాంపియన్‌షిప్‌ టోర్నీ శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగింది. టోర్నీ ప్రారంభంలో పుంగనూరు సీఐ చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఉదయం నుంచి జరిగిన మ్యాచ్‌లలో తొలుత ఆర్డీటీ అనంతపురం జట్టు నెల్లూరు జట్టుతో తలపడగా నెల్లూరు జట్టు 4–3 తేడాతో విజయం సాధించింది. అనంతరం ధర్మవరం జట్టు విజయవాడ జట్టుతో తలపడగా ధర్మవరం జట్టు 4–1 తేడాతో గెలుపొందింది. చంద్రగిరి జట్టు వైజాగ్‌తో తలపడగా వైజాగ్‌ జట్టు 4–2తేడాతో జయకేతనం ఎగురవేసింది.

వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ జట్టు యలమంచిలి జట్టుతో తలపడగా వైఎస్సార్‌ జట్టు 3–0 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే అనంతపురం ఆర్డీటీ జట్టు నెల్లూరు జట్టుతో తలపడగా 1–1తో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో శనివారం జరగనున్న సూపర్‌లీగ్‌ మ్యాచ్‌లకు ధర్మవరం, వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్, నెల్లూరు, వైజాగ్‌ జట్లు అర్హత సాధించాయి. కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు, ధర్మాంబ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ సభ్యులు పల్లెం వేణుగోపాల్, బందనాథం సూర్యప్రకాష్, వడ్డే బాలాజీ, అశ్వర్థనారాయణ, సీనియర్‌ క్రీడాకారులు జెన్నే చందు, అమ్ను, మారుతీ, కోచ్‌ హస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు