సాక్షి, వీకెండ్ ప్రతినిధి: ప్రపంచంలోనే ఎక్కడా దొరకని అద్భుతమైన వంటకాలు తెలంగాణ ప్రత్యేకమని, వీటికి విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి బి.వెంకటేశం అన్నారు. ఫిలింనగర్లో ఉన్న ‘కారంపొడి’కి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రెస్టారెంట్ పురస్కారం లభించిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉడిపి, కామత్ హోటల్స్ స్థాయిలో మన వంటకాలకు ఏ ప్రాంతంలోనైనా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సాధించేందుకుగాను ఒక క్యులినరీ పాలసీని రూపొందించామన్నారు.
‘కాకతీయ థాలి’ పేరుతో తెలంగాణ వంటకాల ఫుడ్ఫెస్టివల్ను ప్రారంభించిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ ఛైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ రుచులలో మన వంటకాలకు సాటిలేదని, వీటి కోసం ప్రత్యేకంగా రెస్టారెంట్స్ ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గదన్నారు. కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు శ్యామ్, అజయ్, కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.