భద్రాచలం : గిరిజన విద్యార్థుల విద్యా వ్యవస్థను పటిష్టపరిచే ప్రణాళికలో భాగంగా వారికి ఆంగ్లవిద్యను నేర్పించి దానిలో పట్టు సాధించడానికి కృషి చేస్తున్నామని ఐటీడీఏ పీఓ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. శుక్రవారం స్థానిక సీతారామనగర్ కాలనీలో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ గురుకులంలో ఆంగ్లమాధ్యమాన్ని బోధించే పక్రియ ప్రారంభమవుతుందన్నారు.
భద్రాచలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలోనే పాఠాలు బోధించి వారి భవిష్యత్తును బంగారు బాటలో పయనించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అందుకు అన్ని సౌకర్యాలతో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడానికి సంకల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, డీసీఓ ఎస్కే బురాన్, ఎడీసీఓ ఎం. దేవదాస్ (గురుకులం) పాల్గొన్నారు.