చలనా పెంపుపై నిరసన

12 Jan, 2017 00:11 IST|Sakshi
చలనా పెంపుపై నిరసన

– ఆర్‌టీఏ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ నాయకుల ధర్నా
అనంతపురం అర్బన్‌ : రవాణా శాఖలో చలానాను పెంచుతూ తీసుకొచ్చిన గెజిట్‌ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉసంహరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి డిమాండ్‌ చేశారు.  స్థానిక ఆర్‌టీఏ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో  బుధవారం ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్‌ 2న రవాణా శాఖలో చలానా ధరలను, అపరాధ రుసుంను భారీగా పెంచుతూ గెజిట్‌ని విడుదల చేసిందన్నారు. జిల్లాలో కరువు నేపథ్యంలో యువకులు  ఫైనాన్స్‌ ద్వారా రుణం తీసుకుని ఆటోల కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆటో డ్రైవర్లు ఆటో తీసుకున్నప్పటి నుంచి రోజు రూ.50 చొప్పున అపరాధరుసం ఏడాదికి రూ.18 వేలు చెల్లించాల్సి వస్తోందన్నారు.   ఆటో డ్రైవర్లతో పాటు అన్ని రకాల వాహన డ్రైవర్లు గెజిట్‌ వల్ల తీవ్రంగా నష్టపోతారన్నారు. కార్పొరేట్‌ శక్తులకు రవాణా రంగాన్ని కట్టబెట్టేందుకే ప్రధాని మోదీ ఈ గెజిట్‌ తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వం గెజిట్‌ని ఉపంసహరించుకోకపోతే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామన్నారు. అనంతరం రెవెన్యూ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కిష్ట, ఎ.మల్లికార్జున, ఏఐటీయూసీ నాయకులు రాజేశ్‌గౌడ్, ఇ.నాగరాజు, పోతులయ్య, రమేశ్, శ్రీధర్, చంద్ర, కృష్ణానాయక్, అల్లీపీరా, శ్రీనివాసులు, రాజు, అన్నూ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు