రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

9 Aug, 2016 22:06 IST|Sakshi
సుల్తానాబాద్‌ : మండలంలోని గర్రెపల్లి బస్టాండ్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి గోస్కుల మహేశ్‌(11) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. భూపతిపూర్‌ గ్రామానికి చెందిన గోస్కుల పోచమల్లు– స్వరూప దంపతుల ఏకైక కుమారుడు మహేశ్‌ గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. రోజులాగానే ఉదయం పాఠశాలకు వచ్చాడు. మధ్యాహ్నం బస్టాండ్‌ వద్ద రోడ్డు దాటుతుండగా పెద్దపల్లి నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న బొలేరో వాహనం రోడ్డు దాటుతున్న మహేశ్‌ను ఢీకొట్టింది.  తీవ్రంగా గాయపడిన మహేశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడనే వార్త తెలియడంతో తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని బోరు విలపించారు. ఎస్సై రాజన్న చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. పోచమల్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సాయంత్రం వరకు పాఠశాలలోనే ఉండాల్సిన విద్యార్థి ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే మధ్యాహ్నం రోడ్డుపైకి వచ్చాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 
 
 
మరిన్ని వార్తలు