రైలు ఢీకొట్టి విద్యార్థి మృతి

26 Feb, 2017 00:06 IST|Sakshi

బెళుగుప్ప : మండల పరిధిలోని యలగలవంక సమీపంలో శనివారం రైలు ఢీకొనడంతో యలగలవంక తండా గ్రామానికి చెందిన విద్యార్థి తరుణ్‌నాయక్‌(15) మృతి చెందాడు. గ్రామస్తులు, స్థానికుల కథనం మేరకు... కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న తరుణ్‌నాయక్‌ శనివారం పాఠశాలకు సెలవు కావడంతో మేకలను మేత కోసం గ్రామ సమీపంలోని రైలుపట్టాల వద్దకు తోలుకెళ్లాడు. పట్టాలకు అతి సమీపంలో కూర్చున్నాడు. కాసేపటికే ఆ పట్టాలపై కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం వైపు వెళ్లే రైలు వచ్చింది.

దాన్ని గమనించకపోవడంతో అది తరుణ్‌ను ఢీకొట్టింది. డ్రైవర్‌ రైలును ఆపి గాయాలపాలైన తరుణ్‌ను చికిత్స నిమిత్తం అదే రైలులో రాయదుర్గానికి తీసుకొచ్చారు. అయితే రాయదుర్గం చేరే లోపే ఆ విద్యార్థి మృతి చెందాడు. అనుకోని ప్రమాదంలో కుమారుడిని కోల్పోయామంటూ తల్లిదండ్రులు రాజ్‌మణిభాయి, రాములునాయక్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాయదుర్గం రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు