శాలిగౌరారం: మండల కేంద్రానికి చెందిన షేక్ సయ్యద్, జుబేదాల కుమారుడు షరీఫ్ పాష అండర్–19 చెస్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 17 నుంచి 19 వరకు రంగారెడ్డి జిల్లా నాగారంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించడంతో పాటు జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. షరీఫ్ పాష గతంలో 2015–16లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికకాగా, ప్రస్తుతం మరోమారు జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థిని స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్లు అభినందించారు. షరీఫ్ ప్రస్తుతం నల్లగొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.