అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి

31 Jul, 2016 01:31 IST|Sakshi
  • హాస్టల్‌ నుంచి పారిపోయి శవంగా మారిన విద్యార్థి 
  • ఇంట్లో సమస్యల కారణంగానే మృతి చెందాడన్న స్నేహితుడు 
  • విచారణ చేస్తున్న తహసీల్దార్, పోలీసులు 
  • నాయుడుపేట : మండలంలోని మేనకూరు ఎస్సీ హాస్టల్‌ పదో తరగతి విద్యార్థి పూడేటి వెంకటేశ్వర్లు (16) రైలు పట్టాలపై అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం వెలుగు చూసింది. శుక్రవారం సాయంత్రం మండలంలోని బిరదవాడ వద్ద రైల్వేట్రాక్‌పై మృతదేహం పడి ఉన్నట్లు నాయుడుపేట స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించారు. ఆయన సూళ్లూరుపేట రైల్వే పోలీసులకు సమాచారం అందిచడంతో శనివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వద్ద లభించిన పర్సులో ఉన్న మహిళ, స్నేహితుడి ఫొటోల ఆధారంగా మేనకూరు హైస్కూల్‌లో 10వ తరగతి చదవే విద్యార్థి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. హాస్టల్‌ వార్డెన్‌ మున్నెయ్య, తల్లిదండ్రులు పూడేటి నల్లయ్య, మునిరాజమ్మకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి గుండెలు పగిలేలా రోదించారు. హాస్టల్‌ వార్డెన్‌ ఉన్నతాధికారులకు విద్యార్థి మృతి విషయాన్ని తెలిపారు. నాయుడుపేట ఇన్‌చార్జి ఆర్డీఓ శీననాయక్, తహసీల్దార్‌ ఉమాదేవి, ఏఎస్‌డబ్ల్యూఓ లక్ష్మీరాజ్యం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని విద్యార్థి మృతికి గల కారణాలపై నివేదిక తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
మరిన్ని వార్తలు