పాత శ్రీకాకుళం: మండలంలోని జాతీయ రహదారి పాత్రునివలస ప్రాంత పరిధిలో గల సాయిడెంటల్ కళాశాల విద్యార్థులు మంగళవారం మూకుమ్మడిగా ధర్నా చేశారు. భోజన వసతులు బాగు లేవంటూ క్లాస్లు బహిష్కరించి కాలేజ్ ఆవరణలో ఆందోళనకు దిగారు. 40 మంది విద్యార్థులకు ఒకే బాత్రూమ్ ఉందని, తాగడానికి మినరల్ వాటర్ కూడా లేదని తెలిపారు. రూ.70 వేలు ఫీజు చెల్లిస్తుంటే రూ.10వేలు విలువ చేసే సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్నా విషయం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే విద్యార్థుల వద్దకు దిగి వచ్చింది. భోజన కమిటీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే కచ్చితమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని విద్యార్థులు తెగేసి చెప్పడంతో చివరికి ఆ కళాశాల చైర్మన్ కమల్విలేకర్ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కరస్పాండెంట్ సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్ సీతారాం సమక్షంలో ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు.