హైదరాబాద్: మోసపోయే వాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడనడానికి నిదర్శనమే ఈ సంఘటన. ఒకే సంవత్సరంలో డిగ్రీ మూడు సంవత్సరాల పరీక్షలు పాస్ చేయిస్తామని నమ్మించి అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసిందో సంస్థ. ఈ సంఘటన నగరంలోని సరూర్నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ఘాట్లో శుక్రవారం వెలుగు చూసింది.
స్థానికంగా నాగార్జున అకాడమీ పేరుతో ఓ అనామక సంస్థను ఏర్పాటు చేసిన విశ్వపాల్రెడ్డి.. డిగ్రీ, ఇంటర్, టెన్త్ గ్యారెంటీ పాస్ అని ప్రచారం చేసి సుమారు 80 మంది విద్యార్థుల నుంచి రూ. 30 వేల నుంచి లక్ష వరకు వసూలు చేశాడు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు తమ పరీక్షలు ఎప్పుడు అని నిలదీస్తుండటంతో కనిపించకుండా వెళ్లాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.