సక్సెస్‌కు నిలువెత్తు నిదర్శనం

10 Sep, 2016 23:47 IST|Sakshi
సక్సెస్‌కు నిలువెత్తు నిదర్శనం
  • పట్టుదలతో జిల్లాలోనే అధిక విద్యార్థులున్న పాఠశాలగా మార్పు
  • ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల
  • ఎందరికో ఆదర్శంగా నిలిచిన హెచ్‌ఎం రాంనిర్మలాదేవి
  •  
    బయోడేటా
    –––––––––––––––––
    పేరు : ఎం.రాంనిర్మలాదేవి
    చదువు : ఎంఏ, బీఈడీ
    స్వ గ్రామం : హుజూరాబాద్‌
    భర్త : చంద్రంరాజు, ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌
    పిల్లలు : ముగ్గురు అమ్మాయిలు, ఒకరు వికలాంగులు 
     
    ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృతి.. ఉపాధ్యాయ వృతే.. ఇందులో ఉన్న సంతృప్తి మరే వృత్తిలోనూ ఉండదు. ఈ సంతృప్తికోసం ఓ ఉపాధ్యాయురాలు పెద్ద యజ్ఞమే చేస్తోంది. ‘వచ్చామా.. చదువు చెప్పామా.. వేళ్లామా’ అని కాకుండా నమ్ముకున్న వృత్తికి న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు గోదావరిఖని గాంధీపార్క్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాంనిర్మలాదేవి. ఆమెలోని వృత్తి నిబద్ధత ఎందరో ఉపాధ్యాయులకు స్ఫూర్తినిస్తోంది. 
    – గోదావరిఖనిటౌన్‌
     
     గాంధీపార్కు ప్రభుత్వ మండల పరిషత్‌ తెలుగు మీడియం పాఠశాలను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. కొన్నిరోజులుగా ప్రయివేట్‌ ఆంగ్లమాధ్య పాఠశాలల ధాటికి ఈ పాఠశాలకు ఆదరణ కరువైంది. కనీస విద్యార్థులు రాలేని స్థితి నెలకొంది. పాఠశాల ఉనికే ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో బడిని బతికించుకోవాలన్న దృఢ సంకల్పంతో రాంన్మిళాదేవి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో జిల్లా, డివిజన్, మండల విద్యా అధికారులకు వినతిపత్రం అందించి, తెలుగు మీడియం పాఠశాలను ఆంగ్ల మాద్యమ పాఠశాలగా నిర్వహించేందుకు అనుమతి కావాలని కోరారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం అనుమతి వచ్చింది. అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయులు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు. మరోవైపు తల్లిదండ్రుల మన్ననలు పొందుతూ ప్రయివేటుకు ఏమాత్రం తీసిపోని విధంగా పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. ఈ అంశాలే పాఠశాల రాంనిర్మలాదేవిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు వచ్చేందుకు కారణాలు అయ్యాయి. ఎందరో ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చాయి. 
    నాడు 50 మంది..  నేడు 450 మంది... 
    2000 సంవత్సరంలో ప్రారంభమైన పాఠశాలలో గతంలో 50 మంది కన్నా తక్కువగా ఉండేవారు. ప్రధానోపాధ్యాయులు రాంనిర్మలాదేవి, ఉపాధ్యాయులు తీసుకున్న ప్రత్యేక చొరవతో ప్రస్తుతం 450 మందిపైగా విద్యార్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలకు ఏమాత్రం తీసిపోకుండా నిత్యం విద్యార్థులపై చూపిస్తున్న శ్రద్ధ, ఇతర బోధన అంశాలు పోషకులను, విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోనే అధిక విద్యార్థులు ఉన్న పాఠశాలగా గుర్తింపు పొందింది.  
    సొంత ఖర్చులతో...
    ఎలాగైనా పాఠశాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండేందుకు చొరవ తీసుకోవాలనుకున్నారు. తలా కొంత డబ్బులు సమకూర్చుకుని మొదటగా విద్యా సంవత్సరంలో చేపట్టనున్న ప్రత్యేకతలపై ప్రచారం చేశారు. టీవీల్లో యాడ్‌ వేయించారు. అనుకున్నట్టుగా విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు పుస్తకాలు, డ్రెస్‌లు, ఆట వస్తువులు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కంప్యూటర్, భోజనం కోసం తినేందుకు ప్లేట్లు, ఫ్యాన్లు ఇతర వస్తువులను కొనుగోలు చేసి పూర్తి సౌకర్యాలతో విద్యను అందిస్తున్నారు. 
    పాఠశాల ప్రత్యేకతలివీ.. 
    సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9.30 నుంచి 4 గంటల వరకు నడుపుతారు. అయితే ఇక్కడ ఈ పాఠశాల మాత్రం సాయంత్రం 5.30 వరకు నడుపుతున్నారు. ప్రత్యేక తరగతులు, స్పోకెన్‌ ఇంగ్లిష్, క్రీడలు, నృత్యం, రీడింగ్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రధానోపాధ్యాయులితోపాటు ఉపాధ్యాయులు ప్రతీనెల కొంత డబ్బులు జమ చేస్తున్నారు.  
     
    ప్రత్యేక చొరవతో ఆదరణ..
    – రాంనిర్మలాదేవి, ప్రధానోపాధ్యాయులు
     
    చిన్ననాటి నుంచి విద్యాబోధన అంటే నాకు ఇష్టం. అనుకున్నట్లుగానే టీచర్‌ ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నా. నా సర్వీసులో ఎక్కడ పనిచేసినా అక్కడ ప్రత్యేక గుర్తింపు నాకు దక్కింది.  గురుదేవోభవ అన్న పదం రోజూ గుర్తు చేసుకుని, వృత్తిలో నిత్యం కొత్తగా ముందుకు సాగుతా. గాంధీపార్క్‌ పాఠశాల విద్యార్థుల కోసం ఇక్కడి ఉపాధ్యాయులు తీసుకుంటున్న ప్రత్యేక చొరవతోనే ఆదరణ పొందుతున్నాం. విద్యార్థుల ఉత్తీర్ణత పెరిగింది. చాల సంతోషంగా ఉంది. మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దిక్కిందనుకుంటున్నాం. జిల్లా అధికారులు గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. 
     
     
మరిన్ని వార్తలు