సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య

11 Aug, 2016 23:02 IST|Sakshi
అక్బర్‌ అహ్మద్‌ మృతదేహం

శంషాబాద్‌: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ సుపారీ ఇచ్చి భర్తను చంపించిన కేసులో ఆర్‌జీఐఏ పోలీసులు గురువారం నలుగు వ్యక్తులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా ఫారుఖ్‌నగర్‌కు చెందినఅక్బర్‌ అహ్మద్‌(40) దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. పదినెలల క్రితం నగరానికి తిరిగొచ్చిన అతను ప్రతిరోజూ తప్పతాగి తన భార్య రయిస్‌బేగంను వేధించేవాడు. దీంతోపాటు ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. అతడి వేధింపులను తట్టుకోలేని రయిస్‌బేగం తన భర్తను చంపించాలని నిర్ణయించుకుంది.

ఇందుకుగాను తనకు పరిచయస్తులైన సయ్యద్‌ అదమ్‌ (30), అబ్దుల్‌ హబీబ్‌(28)తో రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకుని కొంత అడ్వాన్స్‌ చెల్లించింది. గతనెల 18న అదమ్, హబీబ్‌ అహ్మద్‌కు మద్యం తాగించి శంషాబాద్‌లోని కొత్వాల్‌గూడ సమీపంలోని ఆర్కే వెంచర్‌ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అతడి తలపై రాడ్డుతో మోదడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రయిస్‌ బేగంపై అనుమానంతో ఆమెను విచారించగా నేరం అంగీకరించింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు